అభ్యుపగమేప్యర్దాబావాత్!
సాంఖ్య మతావలంబకుల ఆలోచన మేరకు పురుషుడు అసంగుడై, చైతన్యమాత్రుడై, నిష్క్రియుడై, నిర్వికారుడై, ఉదాసీనుడై, నిర్మలుడై, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము గలవాడై కేవలము ప్రకృతి దర్శన రూపభోగములనుభవించి వాటి నుంచి విముక్తుడై మోక్షమును పొందవలెను. వాస్తవానికి ఈ రెండింటి అవసరం లేదు. వారాశించిన ప్రయోజనము వ్యర్థమైయున్నది.
పురుషాన్మవదితి చెత్తథాపి!
సాంఖ్య మతావలంబకుల కథనము మేరకు పురుషుని సామీప్యము చేతనే ప్రకృతి జగత్తును ఉత్పత్తి చేయగలదు ఈ వ్యాఖ్య సరియైనది కాదు. ఎందుకంటే ఒక కుంటివాడు. ఒక గ్రుడ్డివాడు ఇద్దరు సఖ్యతతో కుంటివాడు, గ్రుడ్డివాని భుజములపై కూర్చొని దారి చూపెడ్తూ నడిపించగలడు. ఇద్దరు కూడా చైతన్య స్వరూపులు. కావున సంభవమైంది. కాని జడ ప్రకృతి, పురుషుని సామీప్యము వలన సృష్టి చేయలేదు.
అంగిత్యానుపపతేశ్చ!
సత్త, రజో తమో గుణములతో ఉన్న సామ్యావస్థకు ప్రధాన్ అని పేరు పెట్టబడింది. ఈ గుణములలో విషమత లేదు. కావున అంగాంగీభావము సిద్ధంచదు. వృద్ధిని అంగీ అని తగ్గుదలను అంగ అని అందుము. ఎప్పుడైతే ఈ గుణములను స్వాభావికమైనవిగా గుర్తించుతున్నామో అప్పుడు జగత్తు సృష్టి క్రమము నడుస్తూనే యుంటుంది. ప్రళయము ఎప్పటికి రాదు. కావున సాంఖ్యుల మతము అసంగతమైనది.
అన్యధానుమితౌ చ జ్ఞశక్తి వియోగాత్!
ప్రధానునిలో జ్ఞానశక్తి లేదు. కావున బుద్ధి పూర్వక రచన ఏదీ కొనసాగదు.సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సనాతనుడైన పరమాత్మ మాత్రమే ఈ జగత్తు రచన చేయగలడు. జడ ప్రకృతి జగత్తుకు కారణమని అనుకోవటం యుక్తి సంగతమైన విషయము కాదు.
విప్రతిషేధాచ్చా సమంజసమ్!
సాంఖ్య దర్శనములో అనేకమైన పరస్పర విరుద్ధ విషయాల వర్ణన వచ్చింది. పురుషుడు అసంగుడని, నిష్క్రియుడని చెప్పటం మళ్లీ ప్రకృతి ద్రష్ట అని, భోక్త అని, ప్రకృతిలో సంయోగమని, పురుషుని కొరకు ప్రకృతి భోగవస్తువని, మోక్షమని చెప్పటం అసంగతముగా ఉన్నవి. అందుకని సాంఖ్యదర్శనము నిర్దోషమైనది కాదు.
నిత్యమేవచ భావాత్!
పరమాణువాదులు పరమాణువులను నిత్యములందురు.వాటిలో ప్రవృత్తి మూలక స్వభా వము ఉన్నదనుకొనిన యెడల ఎల్లప్పుడు సృష్టి జరుగుచూనే యుండును. ఒకవేళ వాటిలో యున్న నివృత్తి మూలక స్వభావము ఉన్నదనుకొనిన యెడల ప్రళయము రానే రాదు. కావున ఈ వాదము అయుక్తమైనది.
మహద్దీర్ఘ వద్వాహ్ర స్వపరిమండలాభ్యాం!
పరమాణు కారణవాదులైన వైశేషికుల అభిప్రాయముననుసరించి అణువులు నిత్యములు. ఈ జగత్తు అణువుల నుంచి ఆర్భవించింది. భిన్నమైన అణువుల సమ్మేళనము వలన ఈ ప్రపంచము ప్రభవించింది. ప్రళయకాలమందు జగమంతయు ఒకే ఒక్క అణువులో నిబిడీకృతమై యుండును. సాధారణముగా ద్వ్యణుకములు కలిపి త్య్రణకమేర్పడును. వాటి నుంచి చతుర్గుణకములు అలాగే బహుసంఖ్యాక అణు ద్రవ్యములు ఏర్పడును. వాటి నుంచి చెట్లు, పుట్టలు, గుట్టలు, మిట్టలు, గిరినదీ సముద్రాది ప్రపంచమంతయు ఉద్భవించింది. పరమాణువు నందుండు పరిమాణము పారిమాండల్యమనబడును అనగా సూకా్ష్మతిసూక్ష్మమని అర్థము వచ్చుచున్నది. పరమాణువు కారణ శ్రీకాగల ద్వణుకమునకు పారిమాండల్య పరిమాణము ద్వణుకము కారణముగా గత్య్రణుకమునకు హ్రస్వత్తము కాక మహత్త దీర్ఘత్వ పరిమాణము నందు కలుగునని వైశేషికులు చెప్పుచున్నారు. ఇది సూత్ర విరోధమైయున్నది. వారి నియమము వారే ఉల్లంఘించిరి.
పరమాణువాదుల కథనము ప్రకారము సృష్టికి పూర్వము పరమాణువులు నిశ్చలముగా యుండును. వాటిలో కర్మ ఉత్పన్నమై పరమాణువుల సంయోగము జరుగును. దానితో జగత్తు ఉత్పత్తి జరుగును ఈ కథనము అసంగతముగా యున్నది. ఏ నిమిత్తము లేకుండా పరమాణువుల సంచారము సంభవము కాదు. జీవుల అదృష్టము వారి కర్మ సంస్కారములతో పరమాణువులలో కర్మ సంచారము జరుగును. ఇది అసంబద్ధమైన విషయము. జీవుల అదృష్టము వారితోనే యుండును కాని పరమాణువులతో కాదు. ఈ రకముగా పైన ఉదహరించిన రెండు అంశములలో కూడా పరమాణువులలో కర్మ సిద్ధించుట జరుగును. కావున పరమాణువుల సంయోగముతో జగత్తు ఉత్పత్తి జరుగదు.
వైశేషికుల కథనము ప్రకారము యుత సిద్ధి అనియు అయుత సిద్ధి అనియు రెండు సిద్ధాంతములు కలవు. త్రాడు, కుండ వేర్వేరు వస్తువులయినను, ఇవి యుత సిద్ధి వస్తువులు, వీటికి సంయోగ సంబంధము స్థాపితమగును. అలాగే దారము, వస్త్రము అయుత సిద్ధి వస్తువులు, వీటికి ఎప్పుడును సమవాయ సంబంధము స్థాపితమగును. ఈ రకముగా సమవాయములో భిన్నత ఉంటూ కూడా సమానమవుతుంది. దీనివలన అనవస్థా దోషము వచ్చును.
పరమాణువులు నిత్యములనే వైశేషికులు వాటికి రూప రసాది గుణములు అంటగట్టుట వాటి నిత్యతతకు దోషము వచ్చుచున్నది. రూపాది గుణములతో కూడి యున్న వాటిని నిత్యమైనవనుటకు వీలులేదు. రూపాది గుణము గల ఘటాదులు క్రమంగా తమ రూపాన్ని కోల్పోవుటను ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ రకముగా పరమాణువాదము వీగిపోవుచున్నది.
సహజముగా గంధరస రూపస్పర్శలు గలది భూమి, రసరూప స్పర్శలు గలవి నీరు, రూపస్పర్శలు గల గుణములు గల తేజస్సు, కేవలము స్పర్శ గుణము కలది వాయువు. కాని పరమాణువుల యందు అధిక గుణములు యున్నవనుట దోషముయై యున్నది.
అపరిగ్రహా చ్చాత్యంత మనపేక్షా!
ప్రధాన కారణవాదమును మనువు. మున్నగు శిష్టులు ఒప్పుకొని యున్నారు. కాని ఈ పరమాణు కారణవాదమును ఏ శ్రేష్ఠ పురుషులు కూడా స్వీకరించలేదు. కావున ఇది సర్వథా ఉపేక్షణీయమైనది.
సముదాయ ఉభయహేతు కేషి తదప్రాప్తిః!
బౌద్ధమతము అనుయాయులు పరస్పరము స్వల్ప మతబేధములచే నాలుగు శ్రేణులలో విభజింపబడినారు. వారు వరుసగా వైభాషికులనియు, సౌత్రాంతికులనియు, యోగాచారులనియు, మాధ్యమికులై యున్నారు. ఇందులో వైభాషికులు, సౌత్రాంత్రికులు బాహ్య పదార్థముల శక్తిని మాత్రమే స్వీకరిస్తారు. ఇద్దరిలో యున్న వ్యత్యాసమేమంటే వైభాషికులు బాహ్య పదార్థములను ప్రధానంగా తీసుకుంటే సౌత్రాంతికులు అది రూపొందించడానికి అవసరమైన వైజ్ఞానిక పద్ధతిని పరిగణనలోకి తీసికుంటారు. యోగాచారులు నిరాలంబ/ నిరాధార విజ్ఞానము ను పరిగణనలోకి తీసికొని, ఈ బాహ్య వస్తు సముదాయమంతయు సప్నములో అగుపించిన వాటి వలె మిథ్య అని విశ్వసిస్తారు. మాధ్యమికులు అంతా శూన్యమే అని నమ్ముతారు.
వారి ధారణ ప్రకారము సంస్కారయుక్త విజ్ఞాన ప్రవాహము, దీపశిఖ వలె బాహ్య పదార్థ బాహ్య పదార్థ రూపములో అగుపిస్తుంది. దీపశిఖ రెపరెపలాడుతూ ఆరిపోవుచున్న భ్రాంతి కలిగించినా ఆ జ్యోతి పుంజం అలాగే ఉంటుంది. బాహ్య పదార్థాలు కూడా ప్రతి క్షణము నష్టపోవచునే ఉంటాయి. దీపములో చమురు అయిపోయినాక శిఖ ఆరిపోవునట్లు సంస్కారం సమసిపోవుగానే విజ్ఞానధార శాంతిస్తుంది. ఈ రకముగా శూన్యములోకి ప్రవేశించుటయే ముక్తి అనబడును. ఏది ఏమైనప్పటికిని వీరెల్లరి వాదనలు యోగ్యమైనవి కావు.
బౌద్ధ శాస్త్రములో అవిద్య, సంస్కారం, విజ్ఞానము, నామము, రూపము, స్పర్శ, వేదన, తృష్ణ, ఉపాదానము, జాతి, ముసలితనము, మరణము, శోకము, దుఃఖము, ఉద్వేగము మున్నగునవి కలదనియు అవి పరస్పర కారణరూపముగా, కార్యరూపముగా యుండునని చెప్పబడెను. అవిద్యాది పదార్థములు యంత్రముల వలె నిరంతరము ఆవృత్తములగుచుండుట చేత సముదాయము సిద్ధము కాగలదని బౌద్ధులందురు. ఇది సరియైన వ్యాఖ్యానము కాదు. ఎందుకనగా సముదాయమును ఉత్పత్తి చేయవలసిన కారణమేదియు లేదు.
ఉత్తరోత్పాదే చ పూర్వ నిరోధాత్!
ఘటము, వస్త్రము మున్నగునవి చూసినప్పుడు అవగతమగునదేమనగా కారణభూత మృతిక, తంతువులు మున్నగునవి తమ కార్యములో విద్యమానమై యుండుటను గమనించెదము. అప్పుడే వాటిలో కార్యకారణ భావము సిద్ధి ఏర్పడుతుంది. కాని బౌద్ధ మతములో, సమస్త పదార్థముల నాశనము ప్రత్యేక క్షణములో చూపబడింది. అందుకని వారి ఆలోచన మేరకు కార్యములో కారణము స్థితమవటం సిద్ధించుట లేదు.
అసతి ప్రతిజ్ఞోపరోధో యౌగపద్యమన్యథా!
బౌద్ధ మతములో నాలుగు హేతువులతో విజ్ఞానము కలుగునని చెప్పబడింది. అధిపతి ప్రత్యయము, సహకారి ప్రత్యయము, సమానాంతర ప్రత్యయము, ఆలంబన ప్రత్యయము, ఇవి క్రమముగా ఇంద్రియ, ప్రకాశ, మనోయోగ, విషయములకు పర్యాయ పదములు. వీటిలో హేతుబద్ధత లేదు.
ప్రతి సంఖ్యా ప్రతి సంఖ్యా నిరోధా ప్రాప్తి రవిచ్ఛేదాత్!
బౌద్ధమతము ననుసరించి బుద్ధి పూర్వక వినాశనమునకు ప్రతి సంఖ్యా నిరోధమని పేరు. ఇది పూర్వ జ్ఞానముతో జరుగు ప్రళయ వాచకమై యున్నది. రెండవ దానిలో స్వభావ సిద్ధముగా జరుగు వినాశనము, దీనిని అప్రతిసంఖ్యా నిరోధమందుము. దీనిని స్వాభావిక ప్రళయమందుము. ఈ పరంపర ఇలాగే సాగుతుంటుంది. కావున ప్రయోజనమేమియును లేదు.
ఉభయథా చ దోషాత్!
భ్రాంతిరూపమైన అవిద్య పూర్వజ్ఞానము వలన నశించుచున్న ది. భ్రాంతి రూపమైన అవిద్య పూర్వజ్ఞానము లేక తనకుతానే నష్టమగుచున్నది. వారు చెప్పు అవిద్యానాశనము కుదురుట లేదు. వారు చెప్పునది అసంబద్ధముగా యున్నది.
ఆకాశే చా విశేషాత్!
భూమి, జలము మున్నగునవి కాకుండా ఎన్ని భావరూప పదార్థాలు చూస్తున్నామో వాటి వలెనే ఆకాశము కూడా భావరూపమే. ఆకాశము సత్తా అందరికి తెలియును. భూమి గంధమునకు, జలము రసమునకు, తేజస్సు రూపమునకు వాయువు స్పర్శకు ఆశ్రయమై యున్నవి. అలాగే శబ్దమునకు కూడా ఏదైనా ఆశ్రయము ఉండాలి. ఆకాశమే దాని ఆశ్రయమై యున్నది. ఆకాశము నుండియే శబ్దము ధ్వనిని వినగలుగుతున్నాము. ఒకవేళ ఆకాశము లేని పక్షములో శబ్దము శ్రవణము చేయలేకపోదుము. ప్రత్యేక వస్తువుకు ఒక ఆధారము, స్థానము ఉండాలి. ఆకాశమే మిగతా నాలుగు భూతములకు ఆధారమై, అంతేకాకుండా సంపూర్ణ జగత్తుకు స్థానమిచ్చునదైయున్నది. ఏది ఏమైనను వారు ఆకాశము అభావరూపత్వాన్ని ఆవిష్కరించలేకపోయారు.
అనుస్మృతేశ్చ!
మానవులెల్లరికి తమ పూర్వపు అనుభవాలు గుర్తు వస్తుంటాయి. నేను ఫలానా గ్రామములో ఫలానా వస్తువును చూసియున్నాను. నేను బాల్యదశలో ఫలానా ఆట ఆడేవాడిని. నేను ఇరువది సంవత్సరములకు పూర్వము చూసిన వ్యక్తి అతడే ఇతడు మున్నగునవి. ఈ రకముగా పూర్వానుభవాలను ఎవరైతే పదే పదే గుర్తు చేసికుంటారో దానిని అనుస్మృతి అందుము. ఇది అప్పుడే సంభవమవుతుంది. ఎప్పుడైతే ఆత్మను నిత్యమనుకున్నప్పుడు దానిని క్షణికమనుకునిన్నప్పుడు అది స్మరణకు ఉండబోదు. కావున బౌద్ధుల క్షణిక వాదము నిర్హేతుకమైనది.
నాసతోదృష్టత్వాత్!
కుందేటి కొమ్మును, ఆకాశ పుషాన్ని, వంధాపుత్రున్ని మొదలగునవి నోటితో చెప్పుకోవటమేకాని ఆవి వాస్తవముగా లేవు. ఒకవేళ మట్టి, నీరు అను వాటిని పేర్కొనినప్పుడు, మట్టి నుండి కుండ తయారవటమును, మంచుగడ్డ కట్టటమును ప్రత్యక్షంగా చూస్తున్నాము. కేవలము నోటితో చెప్పుకున్న వాటితో కార్యోత్పత్తి జరుగదు. కావున జగత్తునకు కావలసినది సత్ పదార్థము, బౌద్ధుల వాదము అసంగతమై యున్నది.
ఉదాసీనానామసి చైవ సిద్దిః!
కేవలము ఉదాసీనముగా, నిర్లిప్తంగా, పట్టనట్లుగా యుండి కార్యాలు సిద్ధించాలనుకుంటే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తికావు. తదనుగుణమైన శ్రమ తీసికున్న పక్షములోనే పనులు పరిపూర్తి కాగలవు.
నా భావ్ ఉపలబ్ధేః!
కళ్లకు అగుపించి కార్యరూపములో పరిణమించేది విద్యకాదు. దానివలన మనకు ఉపలబ్ధి ఒనగూరును. స్వప్నగత పదార్థాలను, ఆకాశ పుష్పాలను మిథ్య అందుము, వాటి వలన ప్రయోజనము చేకూరదు.
వైధమ్ర్యాచ్చ న స్వప్నాదివత్!
స్వప్నావస్థలో దర్శనమిచ్చిన వస్తువులు మనకు లభించవు గారడివాడు తమాషాగా చూపి మాయం చేసినట్లు స్వప్నములోని వస్తువులు దొరుకవు. మరుభూమిలో జలమున్నదని భ్రమపడటం,అద్దంలో అగుపించే చంద్రుడు మున్నగునవి మనకు అందుబాటులోకి రావు. సత్పదార్థాలకు, స్వాప్నిక పదార్థాలకు వ్యత్యాసము విపరీతంగా ఉంటుంది.
న భావోనుపలబ్ధేః!ః ఏ వస్తువు మొదట ఉపలబ్ధమగుచున్నదో దాని సంస్కారమే బుద్ధియందు ప్రవేశించుచున్నది. దాని తాలూకు భావాలు కోరికల రూపములో వెల్లడవుతూ ఉంటాయి.
న వియదశ్రుతేః!
ఛాందోగ్యోపనిషత్తులో జగత్తు ఉత్పత్తి వర్ణన వచ్చింది. మొదట తేజస్సు రచన జరిగినట్టు చెప్పబడింది. తేజస్సు, జలము, అన్నము (భూమి) ఈ మూడింటి సమ్మేళనంతో జగత్తు వర్ణన వచ్చింది. ఇచ్చట ఆకాశము ప్రసక్తి రాలేదు. భగవద్గీతననుసరించి ఆకాశము వ్యాపకమైనది. కావున అది నిత్యమైనది. ఉత్పన్నమయ్యేది కాదు.
గౌణ్య సంభవాత్!
అవయవ రహితము, వ్యాపక కారణముగా ఆకాశము ఉత్పత్తి జరగదు. కాని తైత్తరీయోపనిషత్తులో ఆకాశము ఉత్పత్తి చెప్పబడింది. అది అంత గంభీరమైన విషయము కాదు. ఇతర అభిప్రాయముతో మాత్రమే ఆకాశము ఉత్పత్తి గురించి చెప్పియుంటారు. కాబోలు.
అస్తి తు!
బ్రహ్మం సత్యమని జ్ఞాన స్వరూపుడని, అనంతుడని లక్షణములు పేర్కొంటూ బ్రహ్మం నుంచి ఆకాశము ఉత్పన్నమైనట్లు చెప్పబడింది. కాని వేదములో మాత్రము ఆకాశ ము ఉత్పత్తి వర్ణన లేదు.
శబ్దాశ్చ
బృహదారణ్యకోపనిషత్తులో పేర్కొన్న దాని ప్రకారము వాయువు, అంతరిక్షము అమృతమయమైనవి. ఏవైతె అమృతమయమై ఉంటవో వాటి ఉత్పత్తి జరగదు. ఏ రకముగా ఆకాశము అనంతమై ఉన్నదో అదే రకముగా ఆత్మ కూడా అనంతమైనది. బ్రహ్మం శరీరమే ఆకాశమైయున్నది. శ్రుతి వాక్యములతో ఆకాశము అనంతత్తము సిద్ధిస్తున్నది. కావున ఆకాశము ఉత్పత్తి జరుగదు.
స్యాచ్చైకస్య బ్రమ్మ శబ్బవత్:
బ్రహ్మం విజ్ఞానమయ తపము చేత వృద్ధిని ప్రాప్తించుకొనును, దానితో అన్నము (భూమి) ఉత్పన్నమగును. ఏ సర్వజ్ఞుడయితే ఉన్నాడో, అందరిని తెలిసినవాడున్నడో, ఎవరి జ్ఞానమయ తపముందో, దానితో బ్రహ్మం, పేర్లు, రూపము అంతేకాకుండా అన్నము ఉత్పన్నమవుతుంది. ఇందులో మొదట వచ్చిన బ్రహ్మం అను శబ్దము ముఖ్యమైన అర్థములో ప్రయుక్తమైంది. పిదప వచ్చిన బ్రహ్మం అను శబ్దము గౌణ అర్థములో ఉపయోగింపబడింది.
ఒకవేళ ఆకాశమును బ్రహ్మం కార్యము కాదని అనుకున్న యెడల బ్రహ్మం నుండి వేరుగా అనుకున్న పక్షములో బ్రహ్మంను తెలుసుకున్నా కూడా ఆకాశమును గురించి తెలియని స్థితి ఉంటుంది. దీనివలన ప్రతిజ్ఞాహాని కలుగుతుంది. అంతయు బ్రహ్మమయమైయున్నది. నిస్సందేహముగా అంతయు బ్రహ్మమే. ఎందుకంటే ఉత్పత్తి, స్థితి, ప్రళయము అందులోనే ఉన్నవి. ఆకాశము కూడా బ్రహ్మం కార్యమని శ్రుతికార్యాలు రుజువు చేస్తున్నాయి.
యావతద్వికారం తు విభాగో లోకవత్!
వీరంతా ఫలాన దేవదత్తుని కుమారులు అని చెప్పినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. అలాకాక అందులో నుండి ఒకరిద్దరు కుమారుల పేర్లను పేర్కొంటూ చెప్పినప్పుడు కూడా మిగతా వారెల్లరు దేవదత్తుని కుమారులు కాకుండా పోరు గదా! అలాగే ఈ సమస్త వికారాత్మక జగత్తు కార్యం బ్రహ్మందని చెప్పినప్పుడు ఆకాశమును వేరుగా ఎలా చూస్తాము? వాయువును, ఆకాశమును అమృత తుల్యము అని చెప్పటంలో విశేషమేమంటే అవి దేవతల వలె చిరంజీవులను అర్థం వచ్చుచున్నది.
ఏతేన మాతరిశ్వా వ్యాఖ్యాతః!
ఏ యుక్తి ద్వారా ఆకాశమును బ్రహ్మం ద్వారా ఉత్పన్నమైనదని చెప్పి రుజువు చేశామో అదే యుక్తి ద్వారా వాయువును కూడా ఉత్పన్నము చేసిన విషయము మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు.
అసంభవస్తు సతోనుపపత్తే!
బ్రహ్మం కాకుండా ప్రపంచంలోని సమస్త వస్తు సముదాయం ఉత్పత్తిశీలమేయని గ్రహించవలెను. బుద్ధి, అహంకారము, కాలము గుణము, పరమాణువు అన్నీ ఉత్పత్తి శీలములేయని భావించవలెను. వేదములో పేర్కొన్న దాని ప్రకారము ప్రళయకాలమందు ప్రతి దాని అస్తిత్వము నశించును. కేవలం బ్రహ్మమే మిగులును.
తేజో తస్తథా హ్వావా!
తేజస్సు వాయుతత్తముతో ఉత్పన్నమైంది. శ్రుతులలో ఇలా చెప్పబడింది- బ్రహ్మం మొదట వాయువును, ఆకాశమును ఉత్పన్నము చేసి పిదప వాయువుతో తేజస్సును సృష్టించెను.
పృథివ్యధికారరూప శబ్దాంతరేభ్యః!
అన్నము అను శబ్దము పృథివికి భోధకమైయున్నది. ఈ ప్రకరము తత్తము ఉత్పత్తిని తెలుపుతుంది. అన్నము రూపము నలుపు అని తెలుపబడింది.కాని అది అన్నము రూపము కాదు. అది భూమి రూపము తైత్తీయోపనిషత్తులో జలము నుండి పృథివి ఉత్పత్తి జరిగినట్లు పేర్కొనబడింది.
తదభిధ్యానాదేవ తు తల్లింగాత్సః!
పరమాత్మ స్వయముగా ఉత్పన్నము చేసిన మొదటి తత్తముతో రెండవ తత్తమును ఉత్పన్నము చేయును. దీనివలన తెలియునదేమనగా అన్నింటి సృష్టి చేయువాడు పూర్ణబ్రహ్మ పరమేశ్వరుడే కాని వేరెవ్వరూ కాదు.
అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.
సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.
కృతయుగం——-17,28,000
త్రేతాయుగం—– 12,96,000
ద్వాపరయుగం— 8,64,000
కలియుగం——- 4,32,000
________________43,20,000-సంవత్సరాలు ఒక మహాయుగం
__________________
మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.
2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.
ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు గడిచాయి.ఇది ప్రస్తుతం మనమున్న కాలం.
14మంది మనువుల పేర్లు.
1. స్వాయంభువుడు 2. స్వారోచిషుడు 3. జౌత్తమి 4. తామసుడు
5. రైవతుడి 6. చాక్షుసుడు 7. వైవస్వతుడు (ప్రస్తుత మనువు)
8. సాపర్ణి 9. దక్ష సాపర్ణి 10. బ్రహ్మ సాపర్ణి 11. ధర్మ సాపర్ణి
12. రుద్ర సాపర్ణి 13. దేవ సాపర్ణి 14. ఇంద్ర సాపర్ణి!!