సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, January 10, 2014

గౌరీపతి{నటరాజు}శివతాండవం,మంకణ మహర్షి కథ-శ్రీ శివ మహాపురాణము,అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు{పాణిని మహర్షి}

 గౌరీపతి{నటరాజు}

శివతాండవం

ఏమానందము భుమీతలమున !
శివతాండవమట ! శివలాస్యంబట !
అలలై , బంగారు
కలలై ,పగడపు( బులు(గులవలె మ
బులు విరిసినయవి
శివతాండవమట ! శివలాస్యంబట !
వచ్చిరొయేమొ! వి
యచ్చర కాంతలు
జలదాంగనలై విలోకించుటకు
శివలాస్యంబట !
యేమానందము భుమీతలమున !
పలికెడునవె ప
క్షులు ప్రా(బలుకులొ !
కల హైమావతీ
విలసన్నూపుర
నినాదములకు
న్నునుకరణంబులొ !
కొమ్మల కానం
దొత్సాహమ్ములు
మమ్మరముగ మన
ముల(గదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు
రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును !
హైమావతీ కుసు
మాలంకారము లందున ( దానొక
టౌదు నటించునొ !
లలితా మృదు మం
జులమగు కాయము
పూవుల తాకుల
తో వసివాడెదో ! భారతియుట పా
ర్వతికి నలంకా
రము(దీర్చెడునది!
రమణీయాస్మిత ముల( గావించెనొ
యలరులు మృదువులు !
చతురానును(డే
సవదరించునట శర్వనకుత్తమ
సర్పవిభూషులు !
వీచె విశబ్దిత
కీచకములు మృదు
వీచులు గా( ద
ర్పితలోకమ్ములు
మారుతములు గో
టీరి తాబ్జు(డగు
శివునకు సేవలు
జెల్లించుటకై

తకఝుం తకఝుం
తకదిరికిట నా
దమ్ములతో లో
కమ్ముల వేలుపు
నెమ్మిగ వెల(బడి
నృత్యమాడు నెడ
లయానుగతి(గ
మ్రమ్ముగా శ్రుతి(బ
టుటకో! గొంతులు
సవదరించు ను
త్కటభృంగమ్ములు
ఈ సెలకన్నెల కెవ్వరు జెప్పిరొ!
యా సర్వేశ్వరు
నభినయమహమును
కుచ్చెళ్లులెల్లెడ
విచ్చలవిడిగా
దుసికిళ్లాడ(గ
నసమున (బరుగిడు
ఓ హో హో హో !
యూహాతీతం
బీయానందం
బిలాతలంబున !
సంధ్యాసతి ! యీ
సంభ్రమ మేమిటె !
నవకుసుంభరా
గవసనమేమిటె !
ఆకుంచిత తి
ర్యక్రపసారి ల
జ్జామధుర కటా
క్షపాతమేమిటె !
విలాసవక్రిత
విచలన్మధ్యం
బునహ్రీమతి ! నీ
వునువలెనే చిఱు
పలుకని మేఖిల
వాలక మేమిటె !
యెవ్వరికోసర మీబిబ్బోకము !
శివపూజకో ! యో
చెలువా ! యీ కధ
లెవ్వరు జెప్పిరె ?
యిలాతలంబే
ఆడెడునట నా
ర్యాప్రాణేశ్వరు(
డో దినమణి !నిలు
రా ! దినమింతయు(
బడమటీ దేశపు
వారలకీ కధ
నెఱిగించుటకై
పరుగెత్తెదవో !
అల మృగములు క
న్నుల బాష్పమ్ములు
విడిచెడు నెందుకు !
విశ్వేశ్వరునకు
అడుగులుగడుగుట
కై పాద్యంబో !!!
గుసగుసమని యీ
కిసలయములు స
మందపూరముగా
మాటలాదునెదొ!!!
యేమున్నది! లో కేశ్వరునాత్యమే
ఓ హో హో హో
ఊహాతీతం
బీయానందం
బిలాతలంబున!!!
  1. నటరాజు నామవాచకం. వ్యుత్పత్తి. నాట్యములో రాజు-- శివుడు
నటరాజు పరమ శివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి.కుడి వైపున వెనుక ఉండే చేయి ఢమరుకాన్ని కలిగి ఉంటుంది. ముందుకు ఉండే కుడి చేయి అభయ ముద్రను సూచిస్తుంటుంది. వెనుక వైపునున్న వామ హస్తం అగ్ని ని కలిగి ఉంటుంది. ముందువైపు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరివేసినట్లు ఉంటాయి. ఝటాజూటంలో గంగాదేవి, అర్థ చంద్రాకారం ఇమిడి ఉంటాయి. ఆయన ఆకారం మొత్తం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది.

శివాలయాలలో "వ్యాకరణ దాన మండప మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :

 నటరాజు

                                       "నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలం"
"అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. 
నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది ఈ శ్లోక తాత్పర్యమిది.
నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్యమాడుతూన్నంతసేపూ ఆ జడలు కూడ తిరుగుతూంటాయి. నర్తనమాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు.
నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండేవాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు. పై శ్లోకంలో ""ననాదఢక్కాం అన్న మాటకిదే అర్థం.
వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్‌ వంటివి - తంత్రులనుపయోగించేవి (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి.
చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ""చోపు అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (""నృత్తావసానే) చోపు ధ్వని వినబడింది.
నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, బుుషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థా్యన్ని ""దివ్యదృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో ""దివ్య చక్షు వన్నారు.
సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ""చోపు వస్తుంది. పై శ్లోకంలోని ""నవపంచవారం. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది.
డమరుకపు దరువుల విద్యలుకూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజుకూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది బుుషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనత్‌ కుమార,సనత్సుజాతులనే మహర్షులు. ఆ పధ్నాలుగు దరువులూ ఈ బుుషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ""శివభక్తి సూత్రాలంటారు. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.
నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ""అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని ""అష్టాధ్యాయి  అంటారు.
అ పధ్నాలుగు సూత్రాలనీ ""మహేశ్వర సూత్రాలు అంటారు.
    సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేప్పుడు పఠిస్తారు. (ఈ ఉపాకర్మని తమిళంలో ఆవని అవట్టం అంటారు) నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధమిదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

 శివ మహాపురాణము

శౌనకాది మహర్షులు కోరికమేరకు, శివుడు నటరాజు మూర్తిగా మారుటకు ప్రేరకుడైన మంకణ మహర్షిలవారి కథ చెప్పాడు సూత పౌరాణికుడు.

"ఆర్యావర్తము అనే పుణ్యభూమిలో సప్తసారస్వతము అనే మహాతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేస్తే, శివజ్ఞానం తపస్సిద్ధిగా కలుగుతుంది. అది తెలుసుకున్న పరమశివభక్తుడు మంకణ మహాముని మహర్షుల ఉపదేశానుసారం, అతీర్థాన్ని చేరి, స్నానమాచరించి, ఆవొడ్డునే తపోనిష్ఠలో మునిగి పోయాడు. పంచాక్షరీజపం (ఓం నమశ్శివాయః)తో అతని శరీరం సూర్యసమాన తేజోవిరాజితం కాసాగింది. క్రమంగా భక్తిపారవశ్యంలో తాండవంచేయ సాగాడా మహర్షి. అంతటి భక్తికి మెచ్చి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ - మంకణుడు తాండవం ఆపడే!? శివుడు ఆమహర్షిని ఆపడానికి ప్రయత్నించి, ప్రశ్నలవర్షం కురిపించాడు ఎవరికోసం నీతపం? ఈ తాండవం ఏమిటి? నీ కోరిక లేమిటి? దేనికీ జవాబు చెప్పడాయె ముని. తాండవం ఆపడు.

దాంతో శివుడు ఉగ్రుడై - సహస్రశిర, కర, చరణ, సహస్రనేత్రాది విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా మహాతాండవం ప్రారంభించాడు. ఆయనతో బాటూ ఒక స్త్రీమూర్తి కూడా ఉన్నది. ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దాంతో అతడికి జ్ఞానోదయం కలిగి "మహా నటరాజమూర్తి! శరణు! శరణు!" అంటూ సాష్టాంగ దండప్రణామం ఆచరించాడు. అంతట శివుడు శాంతించి, విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీమూర్తి కూడా అంతర్హితురాలైంది.

మంకణుడు ఆయనకు నమస్కరించి, "దేవాధిదేవా! మహాశివా! ఈ మహాతాండవమేమిటి? ఇంతవరకు మీ పక్కన నిలిచిన ఆ దేవీమూర్తి ఎవరు?" అని ప్రార్ధించగా "ఇది పరమేశ్వరుని దివ్యరూపం ! ఆ దివ్య మూర్తిని నేనే! నాతో ఉన్న దేవి ప్రకృతిరూపిణి. బ్రహ్మరూపుడనై నేను సకల చరాచరాలను పంచవింశతి (ఇరవైఐదు) తత్త్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణుల యందూ నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈతత్త్వం గ్రహించి, భక్తితో నన్ను ఉపాసించి శివ సాయుజ్యంపొందు" అని ఆనతిచ్చాడు పరమశివుడు.

కనుక - లింగరూపుడైనా, అర్థనారీశ్వరుడయినా, నటరాజు అయినా అంతా శివమయమే!" అని వివరించాడు రోమహర్షణ పుత్రుడు.

బ్రహ్మ, తన సృష్టికి హంగులన్నీ సమకూర్చిన రుద్రమూర్తి చేతనే ప్రేరితుడై తన దేహాన్ని అర్థనారీశ్వరుడిగా మార్చుకున్నాడు. తనలో తానే రమించాడు. ఫలితంగా (మధనం లోంచి) స్వాయం భువ మనువు పుట్టాడు. అతడితో పాటే శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికీ సంధానం గావించాడు బ్రహ్మ. వీరివల్ల వరుసగా వారికి ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు సంతానమై జన్మించారు. వీరిలో మూడవస్త్రీ సంతానమైన ప్రసూతిని దక్షప్రజాపతికిచ్చి కట్టబెట్టారు. 'సతీ'దేవిగా - జ్యేష్ఠురాలిగా పార్వతి జన్మించింది - ఈ దక్షునికే. అయితే ఈయన మరొకభార్య అయిన వీరిణి (అసిక్నీ) యందు సతీదేవిగా పార్వతీ జననం జరిగింది. దానికి మూలభూతమైన సంఘటన ఒకటి ఉంది.


మన్మధుణ్ణి ప్రేరేపించి, రెండుసార్లు తపోనిష్ఠా గరిష్ఠుడై వున్న శివునిమీదికి దండయాత్ర చేయించి పరాభూతుడైవున్న బ్రహ్మ, ఏం చెయ్యాలాఅని చతుర్ముఖాలతోనూ ఎన్నెన్నో చతురోపాయాలు వెతికాడు. ఏవీ ఫలిస్తాయన్న నమ్మకం కలగక, నారాయణమూర్తిని ప్రార్థించాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు తలచినదే తడువుగా ప్రత్యక్షమై "కుమారా! ఏమిటి నీకొచ్చిన కష్టం?" అని అరాతీశాడు - ఎంతో వాత్సల్యంగా.

జరిగిందంతా వివరంగా చెప్పి "ఏది ఏమైనా సరే! అ కాలకంఠుని కాంతాదాసునిగా చెయ్యాలి. కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి" అని వేడుకున్నాడు.

"ఇంతేకదా! ఇదేమంత గొప్పసంగతి? గతంలో ఓసారి రుద్రుడు తన పుర్ణావతారం అనీ, తనతోపాటు చరించే మాయను 'సతీ' భావంతో గ్రహించి రుద్రాణిని చేస్తానని అన్నాడు కదా! ఇదంతా మన సంకల్పం కాదు! ఆ పరమమాహేశుని సంకల్పమే! నువ్వు ఆ పరాంబికను వేడుకుని, సతిగా అవతరించమని కోరు. అలాగే - దక్షుడిని కూడా తపస్సు చేయమని చెప్పు!" అంటూ ఉపదేశించి అంతర్థానమయ్యాడు శ్రీహరి.


దక్షుడిని రప్పించాడు పరమేష్టి. "జగన్మాతయైనట్టి మహామాయ గూర్చి తపస్సు చేసి, నీ కుమార్తెగా అవతరించమని కోరుకో!" అని అదేశించి, తానుకూడా ఆ జగజ్జననిని ప్రార్థించాడు - ప్రజాపతి.

అమ్మవారు ప్రత్యక్షమై, శివసంకల్పాన్ని ఆకళింపు చేసుకుని బ్రహ్మ కోరిన విధంగా - శివదీక్షకు మంగళాంతం చెప్పించి, తాను అతని పత్నిగా అవతరించ నిర్ణయించుకుంది సర్వమంగళ. బ్రహ్మకు అభయ ప్రదానం చేసి, అక్కడ తపస్సు చేస్తున్న దక్షుని ఎదుట ప్రత్యక్షమైంది. తన కుమార్తెగా పుట్టవలసిందనీ - అదే తనకు మహాభాగ్యమనీ బ్రహ్మాదేశానువర్తిగా కోరుకున్నాడు దక్షుడు. తథాస్తు! అని ఆమె అంతర్హితురలైంది.

యక్ష రాక్షస గరుడ దంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాలూ ఏ దేవి ఎదుట పాదాక్రాంతమై పాహి పాహి అని శరణువేడుతాయో, ఆ మహాదేవి పాపగా అవతరించి, దక్షునికిచ్చిన వరం ప్రకారం, 'ఉమ' అనే నామధేయంతో పెరగసాగింది.

ఆమెకు యుక్తవయస్స రాగా, బ్రహ్మాదులందరూ, ఇక శివునిచేత గృహస్థాశ్రమం స్వీకరింపజేసే తరుణం వచ్చిందని తలపోసి - ఉమను శివపంచాక్షరీ మంత్రస్మరణ ద్వారా, సర్వకాల సర్వావస్థల యందూ శివాయత్త చిత్తతతో ఉండమని వేడుకుని, శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళారు.

దేవతలంతా తమ మానసాన్ని అ పరమశివుని ఎదుటపరిచి, పరిపరి విధాల ప్రార్థించగా, ఎట్టకేలకు అంగీకరించాడు శివుడు. అదే పరమవరం అనుకున్నారందరూ.

కానీ, శివుడు ఒక షరతు విధించాడు -

తాను నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటాననీ; తనను వరించబోయే లలనామణి, ఏనాడూ తన సాధనకు అడ్డుకారాదనీ; తాను కాముకుడిగా సంచరించువేళ మాత్రమే ఆమె కాముకి కావాలనీ; తనకు సానుకూలంగా వర్తిల్లగలిగే పిల్లనే పెళ్లాడగలననీ పరమశివుని వాక్యసారాంశం. సరే నన్న దేవతా సమితి క్రమక్రమంగా దాక్షాయణి విషయాన్ని, శివుని చెవిన వేసి - ఔననిపించుకున్నాక గాని, వారి హృదయాలు తేలికపడలేదు.
 అష్టాధ్యాయి

3.అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు

అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అనెదరు. ఆ గ్రంధమున ఎనిమిది (8)అధ్యాయములు కలవు. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు కలవు.

 4.పాణిని మహర్షి:

సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు            
పాణిని అనే మహర్షి వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణం గ్రంథం. ఈయన క్రీ.పూ. 7వ శతాబ్దికి చెందినవాడు. మాహుర్ అనే పట్టణంలో జన్మించాడు. ప్రస్తుతమిది పాకిస్థాన్లో ఉంది. ఇతడు పుట్టుకతోనే తెలివైన వాడు కాదట. మందమతిగా ఉండేవాడు. తండ్రి ఇతనిని విద్యాభ్యాస నిమిత్తం గురుకులంలో చేర్పించాడు. మందమతి కావడం వల్ల చదువొచ్చేది కాదు. అతనిని భరించలేక, అతడి వల్ల మిగతా పిల్లలు కూడా పాడవుతారని గురువుగారు అతడిని ఆశ్రమం నుండి పంపిచేశారు. అతడు బాధతో ఇంటికి వెళ్ళక హిమాలయాలకు పోయి శివుని కోసం తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శివ దర్శనం అయి ఆయన 14సార్లు మ్రోగించిన ఢమరుక నాదము అతడికి 14 సూత్రాలుగా వినిపించాయి. దానితో అతడు కావ్య రచన చేశాడు. అలా అతడు వ్రాసినదే అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణ గ్రంథం.