సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, June 18, 2016

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం

* ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం ....
* శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎందుకు ఉంటుంది ..??
* మహ అద్భుతమైన శ్రీవేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ .....
* శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడాని గల కారణం ..??

పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.
వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.
అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.
ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.
అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
శ్రీవారి వజ్రం ....
శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.
రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట....!
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా? స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము.
తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.
అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.
ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించేపీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.
తిరుమల సుప్రభాత సేవ :......
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం 'సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవ తో ఆ రోజు నిర్వహించబోయే పూజా కార్యక్రమం ప్రారంభమై బంగారు వాకిలి ద్వారములు తెరుస్తారు.
తిరుమల లో ప్రతిరోజు నేటికి ప్రప్రధమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గొవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాఢావీధి లో ని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.
శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు.
ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ' ద్వార ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు - ఉత్తరం వైపు స్త్రీలు వరుసగా నిలిచి వుంటారు.
ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారి ని విశ్వరూప దర్శనం చేసుకుంటారు. సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కు రుసుము రూ.120-00. సుమారు 1 సంవత్సరం ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్కోవచ్చు. సిఫార్సు లేఖల ద్వార ఒక రోజు ముందుగా కూడా ఈ సేవ టికెట్లు పొందవచ్చు. ఈ సిఫార్సు లేఖలను తిరుమల జే.ఈ.ఓ వారి క్యాంపు కార్యాలయంలో సమర్పించి టిక్కెట్లు పొందవచ్చు. ఈ విధంగా ఖరీదు చేసే టిక్కెట్టు వెల 240-00 వుంటుంది. సంవత్సరంలో ఒక్క మార్గశిర (డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు) మాసంలో మాత్రం ఈ సేవను నిర్వహించరు. సుప్రభాతం స్థానంలో ధనుర్మాసం 30 రోజుల పాటు 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడా జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడా శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.

ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పదకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది. అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అపుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములనుఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది. కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు

 కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు

'వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి'
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.
తిరుమల పుణ్యక్షేత్రం 'కలియుగ వైకుంఠ'మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి 'ఆనంద నిలయ'మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి 'కల్యాణకట్ట' వద్దనే తలనీలాలు సమర్పించాలి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:
వారం
సమయం
ఆదివారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
సోమవారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
మంగళవారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు
బుధవారం
ఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
గురువారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శుక్రవారం
ఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శనివారం
ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు
వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.
తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకునితితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వలే టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.
తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
వసతి సౌకర్యం
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరు
హాజరు కావాల్సిన సమయం
సుప్రభాతం
ఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవ
ఉదయం 3 గంటలకు
అభిషేకం
ఉదయం 3 గంటలకు
తోమాల
ఉదయం 3గంటలకు
అర్చన
ఉదయం 4గంటలకు
నిజపాద దర్శనం
ఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవ
ఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకం
ఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవ
ఉదయం 5గంటలకు
విశేషపూజ
ఉదయం 6గంటలకు
కల్యాణోత్సవం
ఉదయం 10గంటలకు
వూంజలసేవ
ఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవం
మధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవం
మధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవ
సాయంత్రం 5గంటలకు
ప్రధాన/ ప్రత్యేక పూజలు:
నిత్యసేవలు: సుప్రభాతం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120
నిత్యసేవలు: తోమాల
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: అర్చన
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: కల్యాణోత్సవం
ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000
నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం
ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: డోలోత్సవం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ
ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600
నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: తిరుప్పావడ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: అభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750
నిత్యసేవలు: నిజపాద దర్శనం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ
ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250