సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, June 29, 2016

నమో.. సూర్యదేవా

నమో.. సూర్యదేవా..


నమో.. సూర్యదేవా..
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌.
బ్రహ్మశాపంతో..
ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు బాధ నుంచి విముక్తి కలిగించమని కలిగించమని అతను నవగ్రహాలను ప్రార్థించాడు. దీంతో అనుగ్రహించిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు.
దీనిపై సృష్టికర్త బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని శాపం పెడుతాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారకుడైన పరమేశ్వరుని కోసం తపస్సు ఆచరిస్తాయి. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి కలిగిస్తాడు. వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటూ ప్రార్థిస్తే వారికి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఆ మహేశ్వరుడు.
ఉషా, ప్రత్యూషలతో కలిసి...
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తుంటారు. సూర్యదేవుడంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. అయితే అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో వుంటాడు. స్వామి వివాహవేడుకల్లో వుండటం విశేషం. మిగతా గ్రహాలకు కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలు వున్నాయి. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ఆలయ నిర్మాణం
క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివకామి, వినాయక, మురుగన్‌ విగ్రహాలున్నాయి. వీటితో పాటు ప్రధాన మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం వుంది. ప్రాంగణంలోనే ఇతర ఏడు గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి.
ఉత్సవాలు
తమిళమాసమైన తాయ్‌ నెలలో జరిగే రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. తాయ్‌ మాసం (జనవరి-ఫిబ్రవరి)లో ఈ వేడుక జరుగుతుంది. సూర్యదేవుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో రథ సప్తమి వేడుకలను వైభవంగా పదిరోజుల పాటు జరుపుతారు. అలాగే ప్రతి తమిళమాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. మహాభిషేకానికి విశేషసంఖ్యలో భక్తులు హాజరవుతారు.
గ్రహశాంతికి ప్రత్యేక పూజలు
గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా వున్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి పూజలు సాంత్వన కలిగించమని వేడుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన... తదితర పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం... తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.
ఎలా చేరుకోవాలి
* రైలులో వచ్చే ప్రయాణికులు కుంభకోణం రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి ఆలయం 15 కి.మీ.దూరంలో వుంది. ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లవచ్చు.
* సమీప విమానాశ్రయం తిరుచినాపల్లిలో వుంది. విమానం దిగిన ప్రయాణికులు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్లవచ్చు. ( దూరం 110 కి.మీ.)
* వసతి సౌకర్యాలు: కుంభకోణంలోనే ఎక్కువ వసతి గృహాలున్నాయి.

శివ నామావళి

శివ నామావళి

శంభో శంకర సదా శివా

సర్వేశ్వరా మాం పాహి ప్రభో

పాహిప్రభో మాం పాహి విభో

లింగోద్ భవకరా లింగేశ్వరా

జగదీశ్వరా మాం పాహిప్రభో 1

చంద్రశేఖర చంద్రశేఖర

చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర

చంద్రశేఖర రక్స్హమాం 2

శివాయ పరమేస్వరాయ శశిశేఖరాయ నమ ఓం

భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమఓం

గౌరీశ్వరాయ నమఓం పరమేశ్వరాయ నమ ఓం 3

జయ జయ శంకర జయ అభయంకర

పార్వతి శంకర శంభో శంకర

సృస్హ్టి స్తితిలయ కారణ కారణ

మృత్యుంజయ గణ నాయకా

ఉమాపతే శివ శంకర శంకర

గంగాధరా జగదీశ్వర ఈశ్వర 4 (జయ జయ )

చంద్రశేఖరాయ నమఓం గంగాధరాయ నమఓం

ఓం నమశివాయ నమఓం హర హర హరాయ నమఓం

శివ శివ శివాయ నమఓం సర్వేస్వరాయ నమఓం

శివ శివ శివాయ నమఓం జగదీశ్వరాయ నమఓం 5

పోలో నాద ఉమాపతే శంభో శంకర పశుపతే

నంది వాహనా నాగ భూస్హణా

చంద్ర శేఖరా జడాధరా

గంగాధరా హర గౌరీ మనోహరా

గిరిజా కాంతా సదాశివా (బోలో నాదా)

కైలాసవాసా కనక సభేశా

గౌరి మనోహర విశ్వేశా

స్మశానవాసా చిదంబరేశా

నీలకంఠ మహదేవా (బోలో నాదా) 6

శివాయ నమ శివ లింగాయ నమ్ ఓం

భవాయ నమ భవ లింగాయ నమ్ ఓం

సర్వాయ నమ సర్వ లింగాయ నమ్ ఓం

రుద్రాయ నమ రుద్ర లింగాయ నమ్ ఓం

ఆత్మాయ నమ ఆత్మ లింగాయ నమ్ ఓం 7

మృత్యుంజయాయ నమ్ ఓం

త్రయంబకాయ నమ్ ఓం

లింగేశ్వరాయ నమ్ ఓం

సర్వేశ్వరాయ నమ్ ఓం

ఓంనమ శివాయ నమ్ ఓం

ఓం నమశివాయ నమ్ ఓం 8

హే ఇందుశేఖరా రాజా శివ రాజా

హే ఇందుశేఖరా శంభో శివ రాజా

హే హర హర శివ శివ పినాకవైభవ

రాజా శంకర శివ రాజా 9

నమ పార్వతి పతయే శంభో

హర హర హర హర మహాదేవా

హర హర హర హర మహదేవా

శివ శివ శివ శివసదాశివా

మహా దేవా మహా దేవా

దేవా శివా సాంభ సదాశివా (నమ పార్వతి) 10

నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా

శివరాజా శివరాజా శివకామిప్రియ శివరాజా

చిదంబరేశా నటరాజా చిత్సభేశా శివరాజా (నటరాజా) 11

కాల కాల కామ దహన కాశినాద పాహిమాం

విశాలాక్స్హి అంబశక్తి విశ్వనాధ రక్స్హమాం

డంభో శంకర గౌరీశా శివ

శంభో శంకర గౌరీశా

సామ గానప్రియ గౌరీశా శివ

సాంభ శంకరా గౌరీశా (కాల కాల )

ఉమా మహేశ్వర గౌరీశా శివ

ఊర్ధవ తాండ గౌరీశా

విశ్వనాధ ప్రభు గౌరీశా శివ

సాంబ శంకర గౌరీశా (కాల కాల)12

అసంభోమహదేవ చంద్రచూడ

శంకర సాంబ సదా శివ

గంగాధరా కైలాస వాసా

పాహిమాం పార్వతి రమణా (శంభో) 13

హర హర శంకర సాంబ సదాశివ ఉ ఈశా మహేశా

తాండవ ప్రియహర చంద్ర కలాధర ఈశా మహేశా

అంబా సుత లంభోదర వందిత ఈశా మహేశా

తుంగ హిమాచల శృంగ నివాసిత ఈశా మహేశా 14

భోలో భోలో సబ్మిల్ బోలో ఓం నమశివాయ

ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

జూట్టుజడా మేగాంగధారి త్రిశూలధారి డమరు బజాలో

డమడమడమ డమరు బజావో

కూంజ్ ఉడా ఓం నమశివాయ (బోలో...) 15

శంకర శంకర శంకరా

శంకర అభయంకర

పాహిమాం కృపాకరా

పాహిమాం పరమేశ్వరా

పాహిమాం కృపాకరా

పాహిమాం జగదీశ్వరా (శంకర..) 16

జయ జయ జయ శంకర హర హర హర శంకర

దేవ మనోహర హే పరమేశ్వర

పార్వతి నాయక పాహి శంకర (జయ జయ )

నందివాహన నాగభూస్హణా

దేవ మనోహర హే పరమేశ్వర

పార్వతి నాయక హే పరమేశ్వర (జయ జయ) 17

హే శివ శంకర నమామి శంకర

శివ శంకర శంభో

హే గిరిజాపతి భవానీ శంకర

శివ శంకర సంభో

శివ శంకర సంభో (హే శివ) 18

గోవింద నామావళి

గోవింద నామావళి

శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శ్రీవారి ఆలయంలోని మూలమూర్తి శిలా విగ్రహం

శ్రీవారి ఆలయంలోని మూలమూర్తి శిలా విగ్రహం


తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం. అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా, అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే పూజానైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువ బేరానికే. ధ్రువబేరం అంటే మూలమూర్తి - శిలా విగ్రహం. ఎవరూ ప్రతిష్టించింది కాదు - పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ. ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని, తర్వాత కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెల్పి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలోనుండి తీయించి ఆలయం కట్టించమన్నాడనీ., పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండుగోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడుండేవాడనీ.

యోగులకు, దేవతలకు తపస్సంపన్నులకే కన్పడేవాడనీ. అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకూ ఇక్కడ ఉండి, పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి, లోకాలను రక్షించమని కోరాడనీ. బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీవేంకటాచలంపై ఉన్నాడనీ పురాణాలలో ఉంది.
ప్రస్తుత తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైఖానస, పాంచరాత్ర, శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి? నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి? కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి? శయనమూర్తి ఎలా ఉండాలి? విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి? అవతార రూపాలు ఎలా ఉండాలి? వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది.
కాని శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహం లాగానూ లేదు. అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి వుందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక, తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకూ వైఖానస పూజావిధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షఃస్థలంలో శ్రీదేవి ఉంది. నాలుగు చేతులలో, రెండు పైకెత్తినట్లు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) ఉంటే మూడవది వరదహస్తం, నాలుగవది కటి హస్తం. అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం. అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసారసాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం. మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ - భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి.
ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతారరూపాలలో రామ, కృష్ణావతార విశేష ఘటనాప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం (మూలవిగ్రహానికి) మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు చేయిస్తే, రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. చివరిగా బలిబేరం. విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ - అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి, అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు.

కీర పండరీపురము

పాండురంగడు ప్రత్యక్షమైన కీర పండరీపురము

భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళగురించి పురాణాల్లో చదివాముగానీ, కలియుగంలో భక్తునికోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా. చిలకలపూడిలోని కీర పండరీపురం చరిత్ర చదివాక నమ్మక తప్పదండీ. చిలకలపూడి అనగానే చాలామంది మహిళామణులకు చిలకలపూడి బంగారం నగలు, అవేనండీ రోల్డుగోల్డు నగలు గుర్తుకొస్తాయి. ఈ రోజుల్లో అవికూడా ప్రియమయిపోతున్నాయిగానీ అంతకన్నా ప్రియమైంది చిలకలపూడిలో మరొకటి వున్నది. అదే పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించిన కీర పండరీపురము. మచిలీపట్నం శివార్లల్లోవున్న చిలకలపూడిలో వున్న ఈ క్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారుట. అంటే దోస విత్తులు నాటి, అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి, భగవంతునికి సమర్పించటం.

అందుకనే కీర పండరీపురం అనే పేరు వచ్చి వుండవచ్చునని కొందరి అభిప్రాయం. ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన భక్త నరసింహమే అంతకుముందు కాకి బంగారంతో నగలు చెయ్యటంకూడా కనిపెట్టారని అంటారు.
1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులకు జన్మించారు సరసింహంగారు. ఈయనకి చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ. తన 18 వ సంవత్సరంలో చిలకలపూడి వచ్చిన నరసింహంగారు అక్కడే వ్యాపారం చెయ్యటం మొదలుపెట్టి, కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. క్రమంగా ఆయన మనసు దైవభక్తివైపు అధిక మొగ్గు చూపించి, పాండురంగ విఠలుని వైపు మళ్ళింది. నరసింహంగారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది. ఆయన నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమునుకూడా ఉపదేశించి భక్త నరసింహం అనే పేరు పెట్టారు.

గురువుగారి ఆశీర్వచనముతో భక్త నరసింహం తన మనసులోని కోరిక, ఆలయ నిర్మాణమును తలపెట్టారు. శంఖుస్ధాపనకోసం పండరీపురములోని చంద్రభాగానదిలోని కొన్ని గులక రాళ్ళను ఉపయోగించ సంకల్పించారు. కానీ చంద్రభాగానది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.
నరసింహంగారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగనినుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యునికోసం తాను తెలిపిన రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంగారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళంవేసి సీలు చేశారు. క్షణాలు గడుస్తన్నకొద్దీ నరసింహంగారికి ఆందోళన ప్రారంభంమయింది. ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట.. పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని .
పగలు పదిన్నర అయింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి దివ్య తేజస్సులమధ్య పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురములోని పాండురంగని విగ్రహమువలెనున్నది. అక్కడలాగానే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.
తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు. ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తంగావించబడ్డాయి.

శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు..వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం..దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము. 400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.
భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు.
దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు. ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.
ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు. శ్రీ నరసింహంగారి మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.
సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రంనుంచే కాక ఒరిస్సానుంచికూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహంగారి సంతతివారిచేతే నిర్వహించబడుతున్నది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో వున్నది.