సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 7, 2016

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం...

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం...
పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!

తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.

గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.

దేవీ రూపాలు... ప్రత్యేక నైవేద్యాలు!

దేవీ రూపాలు... ప్రత్యేక నైవేద్యాలు!
దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఆమె నామాలు, అవతారాలు, రూపాలు అనేకం. ఏ రూపంలో కొలిచినా ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే పూజకి మరింత ఫలితం. అమ్మవారు ఏ రూపంలో ఏ నైవేద్యాన్ని ఇష్టపడతారో తెలుసుకుందాం.

బాలాత్రిపుర సుందరీదేవి - పొంగలి
గాయత్రీ మాత - పులిహోర
అన్నపూర్ణాదేవి - కొబ్బరన్నం
లలితాత్రిపురసుందరి - గారెలు
సరస్వతీదేవి - పెరుగన్నం
మహాలక్ష్మిదేవి - రవకేసరి
దుర్గాదేవి - కదంబం - అన్నికూరలు అన్నం కలిపి వండే వంటకం
మహిషాషురమర్ధిని - బెల్లంతో చేసిన వంటకం
రాజరాజేశ్వరి అమ్మవారు - పరమాన్నం!!

శరన్నవరాత్రులు ఎందుకంటే

శరన్నవరాత్రులు ఎందుకంటే...

దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం సంప్రదాయం. అమ్మవారి వివిధ రూపాలు...

1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దశమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదశమి

దసరా నవరాత్రులు... నవ వర్ణాలు!

దసరా నవరాత్రులు... నవ వర్ణాలు!
                                                                                          
దసరా నవరాత్రుల్లో... దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం... 

మొదటి రోజు: నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

రెండో రోజు : బ్రహ్మచారిణిగా శక్తిని కొలుస్తాం. కనుక ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి.

మూడో రోజు: అమ్మవారి అవతారం ఈ రోజు చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి.

నాలుగో రోజు : దుర్గమ్మను కూష్మాండ అవతారంగా కొలుస్తాం. నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది.

అయిదో రోజు: స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించి పూజచేయాలి.

ఆరో రోజు: కాత్యాయనీ మాతగా అమ్మవారు కొలువుదీరే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

ఏడో రోజు: కాళరాత్రి అవతారంతో అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుంది. ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి.

ఎనిమిదో రోజు: మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి.

తొమ్మిదో రోజు: చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందు కుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం!!

మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?

మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?
శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా  జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు.
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి. వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు, మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది.  ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి. జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని
తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే  మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.

మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?

కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?
నాలుగు యుగాల్లో కలియుగంలో పాపాలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంటుంది. కలిపురుషుని ప్రభావంతో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు సంభవిస్తుంటాయి. మానవులు ధర్మబాటలో నడవకుండా అధర్మప్రచారానికి ప్రభావితమవుతారు. కలియుగంలో మనకు అండగా వుండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడుకొండలపై శ్రీ వేంకటేశ్వరస్వామిగా అవతరించారు. స్వామిని స్మరిస్తేనే పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా వుంటూ భక్తుల పాపాలను తొలగిస్తున్న స్వామిని ‘కలౌ వేంకటనాయకా’ అని పిలుస్తారు.
‘సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే ’ భవిష్యత్‌పురాణంలో ఇలా పేర్కొన్నారు. అన్ని పాపాలను ‘వేం’ అని అంటారు. కట అంటే తొలగించడం. వేంకట అంటే మన పాపాలను దహించేవాడు. అందుకనే ఆ నారాయణుడిని కలౌ వేంకటనాయకా అని భక్తితో కొలుస్తాము. ‘‘ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే, రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌’’ఈ మంగళశాసనం వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమండలంలోని తిరునగరిలోని పుష్కరిణిలో విహరించడానికి విచ్చేశారని వెల్లడిస్తోంది. తన భక్తులను స్వయంగా పరిరక్షించేందుకే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఆదివ‌రాహ‌ స్వామి వద్ద అనుమతి పొంది నివాసముంటున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వెలిశారు కనుకనే ఈ తిరుక్షేత్రం లక్షలాది భక్తుల రాకతో దివ్యారామంగా విరాజిల్లుతోంది.

అష్టమహాదానాలని వేటిని అంటారు?

అష్టమహాదానాలని వేటిని అంటారు?

సనాతన సంప్రదాయంలో అష్టమహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు వున్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటిని దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి.
ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. భూమిని దానం చేయడం ద్వారా సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భయముండదు. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.
ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి మనకున్నంతలో ఇవ్వడమే అని పరమార్థం.

భూకైలాసం..

భూకైలాసం..
పరమేశ్వరుడు స్వయంభువుగా భువిపై వెలసిన క్షేత్రమే చెన్నై నగరంలోని మైలాపూర్‌లోని అరుల్‌మిగు కపాలీ
శ్వరస్వామి ఆలయం. లయకారకుడైన శివుడు స్వయంగా భువిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. సాక్షాత్తు ఆ జగన్మాత పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన పవిత్రపుణ్యక్షేత్రమది. అరుల్‌మిగు కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. అందుకనే మైలైయే కైలై- కైలేయే మైలై అంటారు. దీనర్థం మైలాపూరే కైలాసం, కైలాసమే మైలాపూర్‌ అని అర్థం. అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది. అందుకనే మయిల్‌ అంటే నెమలి పేరుతో మైలాపూర్‌గా ఏర్పడింది.
బ్రహ్మ శాప విముక్తి.. కైలాసంలో శివున్ని దర్శించిన అనంతరం సృష్టికర్తయైన బ్రహ్మ గర్వం ప్రదర్శించాడు. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు అతని తలల్లో ఒకదానిని ఖండించి ఆ తలను ఒక చేతిలో పట్టుకున్నారు. కపాలాన్ని ధరించిన వాడు కనుక కపాలీశ్వరుడు అని అంటారు. బ్రహ్మ తన పాప నివారణ కోసం మైలాపూర్‌ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేయడంతో ఆయన పాపం పరిహారమయింది.

అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం.. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథనం ప్రాచుర్యంలో వుంది. నమశ్శివాయ అన్న పదానికి అర్థాన్ని శంభునాథుడు పార్వతీ దేవికి వివరిస్తుండగా ఆమె ఒక నెమలి వైపు దృష్టి సారించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన నెమలిగా మారిపొమ్మని శాపం ఇస్తాడు. దీంతో ఆమె శాప విముక్తి కోసం ప్రార్థించగా భూలోకంలో తన కోసం తపస్సు చేస్తే విముక్తి కలుగుతుందని చెబుతాడు. భూలోకంపై అడుగుపెట్టిన పార్వతీ దేవి ఒక చెట్టుకింద నెమలిరూపంలో స్వామివారి కోసం తపస్సు చసింది. ఆమె తపస్సుకు ప్రత్యక్షమైన లయకారకుడు శాపవిముక్తి చేయడంతో పాటు కర్పగవల్లిగా దీవించాడు. దీంతో ఆ ఆదిదంపతులు ఇక్కడే నివాసముంటూ భక్తులకు అభయమిస్తున్నారు.
మురుగన్‌కు వేలాయుధం.. రాక్షసుడు సురపన్మను సంహరించేందుకు సుబ్రమణ్యస్వామి ఈ ఆలయంలోనే తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన ఆదిదంపతులు తమ కుమారునికి వేలాయుధం ఆయుధాన్ని ఇక్కడే ఇచ్చినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. రాక్షస సంహారం అనంతరం శరవణుడు సింగారవేల్‌గా తిరిగొచ్చాడు. దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రమణ్యస్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు. దేవలోకంలో వుండే ఐరావతం దేవసేనతో బాటే వచ్చేస్తుంది. అందుకనే వల్లీ, దేవసేన సమేతంగా మురుగన్‌ ఐరావతంపై దర్శనమిస్తుంటారు. ఇది అరుదైన దర్శనం కావడం విశేషం.
తిరుజ్ఞాన సంబంధర్‌.. నయనార్ల పరంపరలో తిరుజ్ఞాన సంబంధర్‌ మహాభక్తుడు. ఆయన తొలి కావ్యాన్ని స్వామి సన్నిధిలోనే రాయడం విశేషం. పరమేశ్వరుడు భక్తులకు పెన్నిధి అనే అంశాన్ని ఈ కథ నిరూపిస్తుంది. శివనేశ్వర్‌ అనే భక్తుని కుమార్తె పూంపవై. ఆ బాలిక రోజు శివపూజలో తరించేది. ఒకరోజు పూలు కోస్తుండగా పాము కాటుతో మరణిస్తుంది. భగవంతుడినే నమ్ముకున్న శివనేశ్వర్‌ ఆమె అస్థికలను ఒక కుండలో వుంచుతాడు. ఒకనాడు సంబంధర్‌ అక్కడకు రాగా శివనేశ్వర్‌ తన దీనగాధను విన్నవించి ఆ కుండను ఆయన ముందువుంచుతారు. పరమభక్తుడైన సంబంధర్‌ కపాలీశ్వరుని ఆర్థ్రతతో ప్రార్థిస్తాడు. మట్టిట పున్నై అనే గానంలో పరమేశ్వరుని పండగలను వివరిస్తూ బాలిక శివుని పర్వదినాలను ఎలా వీక్షించకుండా వుండగలదు అని వేడుకుంటాడు. దీనదయాళుడైన ఆ శంభునాథుడు ఆ బాలికకు తిరిగి ప్రాణం పోస్తాడు. ఒక్కసారిగా కుండలు పగిలి అస్థికల నుంచి బాలిక బతికొస్తుంది. కృతజ్ఞతాభావంతో శివనేశ్వర్‌ సంబంధర్‌కు ఆమెను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అయితే తాను జీవితాన్ని తిరిగి ఇచ్చాను కాబట్టి తండ్రిలాంటి వాడినని సున్నితంగా తిరస్కరిస్తాడు. పూంపవై తన శేషజీవితాన్ని భగవంతుని సన్నిధానంలో గడిపి శివసాయుజ్యం పొందింది.
ఎలా చేరుకోవాలి..
*
చెన్నై దేశంలోని ప్రధాన నగరం
* అన్నిప్రాంతాలతో చెన్నైకు రవాణాసౌకర్యాలున్నాయి.
*
రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చెన్నై చేరుకోవచ్చు

కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!

కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!
‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’ ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓం (ఓంకారం) పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.
2. యమధర్మ రాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.
3. ఆత్మకు జననం, మరణం లేదు.
4. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక, చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక, చావుల చక్రంతో సంబంధం ఉండదు. అతను బ్రహ్మతో సమానం.
5. యమధర్మ రాజు చెప్పిన దాని ప్రకారం దేవున్ని నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.

ఆత్మల గురించిన ప్రస్తావన….

భగవద్గీత లో.
శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక “అహం బ్రహ్మస్మి” నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి.

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.

తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..? అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..?

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..?
        అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..?

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుకు అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది.అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం...
   
బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.
   
అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.

కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.
   
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.

బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.
   
పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.
 
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది.
   
బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది.
   
చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం.

బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది.
 
ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి.

అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి.

శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు..

భూమి-సూర్యుడి మధ్య దూరం హనుమాన్ చాలీసా లో ఎలా రాసారు?

భూమి-సూర్యుడి మధ్య దూరం 
హనుమాన్ చాలీసా లో ఎలా రాసారు?

15వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసా ను రచించాడు.
ఇందులో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది. 17వ శాతంబ్దంలో 1672 సంవత్సరంలో జీన్ రిచెర్ మరియు జియోవన్ని డోమేనికో కాస్సిని అనే వారు భూమి యొక్క వ్యాసార్థంను (రేడియస్) 22,000 సార్లు కలిపితే భూమి నుండి సూర్యుడి దూరం అంతా అని దృవీకరించారు. భూమి యొక్క వ్యాసార్థం 6,371 కీ. మీ. అంటే 2200 0 x 6371 = 140,162,000 కీ. మీ. (140 మిలియన్ కీ. మీ.) అని శాత్రవేత్తలు చెప్పారు. కానీ అది కేవలం అంచనా అని తేలిపోయింది.
ఇదే విషయాన్ని హనుమాన్ చాలీసా లో కేవలం మూడు ముక్కలలో మరింత స్పష్టంగా తెలియజేసారు. తులసీదాస్ హనుమాన్ చాలీసా లో రచించినట్టు..... యుగ సహస్ర యోజన పరభానూ, లీల్యోతాహి మధుర ఫలజానూ..... అనే దానిలో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది.

యుగ అంటే = 12000
సహస్ర అంటే = 1000
యోజన అంటే = 8
12000 x 1000 x 8 = 96,000,000 మైళ్ళు
1 మైలు = 1.6 కీ. మీ.
96,000,000 x 1.6 కీ. మీ. = 153,600,000 (15 కోట్ల 36 లక్షల కీ. మీ.)
ప్రస్తుతం భూమి నుండి సూర్యుడి వరకు ఉన్న దూరం = 149,600,000
శాస్త్రవేత్తల కన్నా రెండు శతాబ్దాల ముందే... 15వ శతాబ్దంలో తులసీదాస్ ఈ లెక్కను ఇంత దెగ్గరగా ఎలా చెప్పాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం... హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు, సూర్యుడిని పండు అనుకోని మింగేస్తాడు.... అప్పుడే భూమి నుండి సూర్యుని వరకు ఎంత దూరముందో తెలుసుకున్నారని అంటారు. హనుమాన్ చాలీసా లో రచించిన దూరంతో అమెరికా లోని నాసా సంస్థ వారు కూడా ఏకీభవించారు.

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది                                                                                           
ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.

వారణాసిలో నివసిస్తూవున్నసంత్ తులసీదాస్ :రామనామగాననిరతుడయి బ్రహ్మానందములో తేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు.

ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.

ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు.

శవాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది.

శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది..
గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది.

అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.

దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.

ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.

తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీ రామనామము ,మీరు చెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సింహద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ...... జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమి కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది..

శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతుందట… అక్కడ పూజలు చేస్తే కోర్కెలన్నీ తీరుతాయట…

ఆ ఆలయంలో ఉన్న శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతుందట… అక్కడ పూజలు చేస్తే కోర్కెలన్నీ తీరుతాయట
మన దేశంలోని చారిత్రాత్మక హిందూ దేవాలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉందని ముందే చెప్పుకున్నాం కదా! ఆ, అవును. సరిగ్గా ఆ కోవకే చెందే మరో ఆలయం గురించే ఇప్పుడు చెప్పబోయేది. అదే రాజస్థాన్ ధోల్‌పూర్‌లోని శివాలయం. దాదాపు వేయి సంవత్సరాల కిందట నిర్మాణమైనట్టుగా చెప్పబడుతున్న ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ శివాలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొంది. అక్కడి శివున్ని అచలేశ్వర్ మహాదేవ్‌గా పిలుస్తారు.

ఈ శివాలయంలో ఉన్న శివలింగం నిత్యం 3 రకాల రంగుల్లో కనిపిస్తుంది. ఉదయం పూట ఎరుపు రంగులో, మధ్యాహ్నం కుంకుమ పువ్వు రంగులో, రాత్రికి నలుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. కాగా కొంత మంది సైంటిస్టులు ఆ ఆలయంలోకి ప్రవేశించే సూర్యకాంతి వల్లే అలా ఆ శివలింగం రంగులు మారుతుందని చెప్పారు. కానీ వారు దాన్ని సైంటిఫిక్‌గా నిరూపించలేకపోయారు. దీంతో ఈ రంగులు మారడమనేది అత్యంత మిస్టరీగా మారింది.

అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులు రోజంతా అక్కడే ఉండి శివలింగం మారే అన్ని రంగులను చూసి వెళ్తారట. ఎందుకంటే అలా చూడడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.

సాధారణంగా ఏ శివాలయంలో ఉన్న లింగమైనా ఎంతో కొంత ఎత్తు, పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది. అయితే ధోల్‌పూర్ శివాలయంలోని లింగం మాత్రం చాలా పొడవైందని చెబుతారు. అయితే అది పైకి కనిపించదు. చూసేందుకు మామూలు శివలింగంగానే ఉంటుంది. కాకపోతే కింది వైపుకు పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే భూమి లోపల లెక్కకు మించిన అడుగుల లోతు వరకు ఆ శివలింగం ఉంటుందని అంచనా. కొంత మంది భక్తులు ఆ శివలింగం పొడవు తెలుసుకునేందుకు దేవాలయం చుట్టూ భూమి లోపలికి సొరంగంలా తవ్వారట. అయినా ఆ శివలింగం చివరి భాగం మాత్రం ఎవరికీ కనిపించలేదట.

పెళ్లి కాని యువతీ యువకులు ఇక్కడికి వచ్చి శివలింగానికి పూజలు చేస్తే వారికి వెంటనే వివాహం జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయంలో అధిక శాతం మంది యువతీ యువకులు కనిపిస్తారు.

సాక్షాత్తూ పరమశివుడు ఇక్కడ పాదం మోపాడని ఆయన అలా పాదం మోపిన ప్రదేశంలోనే శివలింగం ఏర్పడిందని, అక్కడే ఆలయం కూడా నిర్మించారని ఆ ఆలయానికి చెందిన పురాణ గాథలు చెబుతున్నాయి. కొంత మంది భూమికి మధ్య భాగం ఈ ఆలయంలోనే ఉందని విశ్వసిస్తారు.

ధోల్‌పూర్ శివాలయంలో స్వామికి ఎదురుగా కొలువై ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని 5 విభిన్న రకాల లోహాలతో తయారు చేశారట. ఒకానొక సమయంలో కొంత మంది దుండగులు ఈ ఆలయంలోకి చొరబడితే అక్కడి నందీశ్వరుడే వారిని పెద్ద పెద్ద ఈగలతో బయటికి తరిమికొట్టాడని చెబుతారు.

కాలసర్పదోషం కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం!!

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం!!

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు..

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?
గాయత్రీ మంత్రంలో 24 అరాలున్నాయి. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి, ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదటి శ్లోకంలో గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు సంపుటీకరించి, రామాయణాన్ని పవిత్రం చేశాడు. గాయత్రీ మొదటి అక్షరం 'త' శ్రీరామాయణ ప్రారంభ శ్లోకం'తపస్వాధ్యాయ నిరతం' అని శ్లోకం ప్రథమాక్షరంగా ఉంది. అలాగే పట్టాభిషేక సర్గలో, చివరశ్లోకం, చివరి అక్షరం 'త'గా ఉంది.

ఇదే ఫలశ్రుతి శ్లోకం. పఠన్‌ద్విజో వాగృషభత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో భూమిపతిత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో భూమిపతిత్వమీయాత్ పణిగ్జనః పుణ్యఫలత్వమీయాత్ జనశ్చశూద్రోపి మహత్వమీయాత్ ఇలా, 'త' అనే అక్షరంలో శ్రీరామాయణం పరిసమాప్తమైంది. గాయత్రీ మంత్రంలో 'థియోయోనః ప్రచోదయాత్' అని 'త్' కడపటి అక్షరంగా ఉంది. అందువల్ల శ్రీరామాయణం శ్రీ గాయత్రీమంత్రార్థ ప్రతిపాదకం. గాయత్రీమంత్రద్రష్ట అయినందువల్లే విశ్వామిత్రుడికి శ్రీరాముడి పూర్తి రక్షణ లభించింది.

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి?

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి?
మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదులచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి పై శ్లోకం చెప్పకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లోకములు చెప్పు కోరాదు.
ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం . మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు.
ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించడం ముఖ్యం. హనుమంతునికి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షణాలు చేయాలో తెలుసుకుందాం..

హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం. ఆజనేయ స్వామి గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు చెప్పుకోవల్సిన శ్లోకము''
ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం ! రామదూతం నమామ్యహం !'

రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి.
పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం ‘‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్''

శ్లో|| ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాతం -రామదూతం నమామ్యహం

శ్లో ||మర్కటే శ మహోత్సహా -సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష- శ్రియం దాపయ మే ప్రభో ||

అని చదువు కుంటూ ప్రదక్షిణాుల చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
‘‘యాక్రుత్తే రేభి: ప్రదక్షిణ ణై | శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మ చర్యం, శరిస్నానం , నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తొలగిపోవున్నట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి.

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం, వారం నిత్యమూ చేయగలగం మరీ మంచిది.

మంగళవార సేవ : మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివేదించడం చేయాలి.

శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. ఆరోజున అప్పాలు, వడ మాల వంటివి స్వామివారికి నివేధించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు.

పంచ సంఖ్య : హనుమంతుడుకి పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి 5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం..

శివునికి ఏవిధంగా అభిషేకం చేయాలో తెలుసుకుందాం!!

శివునికి ఏవిధంగా అభిషేకం చేయాలో తెలుసుకుందాం!!

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి.

మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏవిధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకొండి.

ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించునుఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగునుమారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించునుగరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైనా దానం తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు. పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు. చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగునుపుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు. కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగునుపసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.

శుక్రవారం గుడికి వెళ్ళే వారు పాటించాల్సిన నియమాలు

శుక్రవారం గుడికి వెళ్ళే వారు పాటించాల్సిన నియమాలు....!

శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం. అలాగే ముత్తైదువులు, మహిళలకు ప్రత్యేకం. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల కలకలకాలం ముత్తైదు తనం ప్రాప్తిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు.

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు.

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి...

అమావాస్య రోజు ఏం చేయాలి ? ఎలాంటి పూజలు నిర్వహించాలి ?

మహాలయ అమావాస్య 


అమావాస్య రోజు ఏం చేయాలి ? 

 
                                   

ఎలాంటి పూజలు నిర్వహించాలి ?

ఈ సెప్టెంబర్ ౩౦ న వచ్చే అమావాస్యను బహుళ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య భాద్రపదమాసం కృష్ణపక్షం చతుర్ధి రోజు వస్తుంది. ఈ పర్వదినాన శివుడిని భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. ఈ అమావాస్య రెండు రోజులు ఉంటుంది. ఈ మహాలయ అమావాస్య రోజును శివుడిని పూజించడం వలన కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తాయని నమ్మకం. పూర్తీ నమ్మకంతో భక్తితో శనిదేవుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా.. పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శనివారం:
శనివారం అమావాస్య వచ్చిందంటే ఆ రోజును చాలా పవిత్ర దినంగా భావించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ రోజున శని దేవుడిని పూజించడంవలన సకల పాపాలు తొలగి ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం సంపద శ్రేయస్సు కలుగుతుంది.

పుణ్యక్షేత్రాలు:
భాద్రపద అమావాస్య అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రోజు. అందుకే ఆ రోజున పుణ్యక్షేత్రాలు దర్శించి పవిత్ర స్నానాలు చేసి, యాగాలు చేసి,ఉపవాసం ఉండడం వలన పాపాల నుంచి విముక్తి పొందుతారు.

విష్ణు:
ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మానసిక ప్రశాంతత,శారీరక ఆరోగ్యం, ఆర్ధికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.