సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, July 14, 2016

తొలి ఏకాదశి విశిష్టత.

తొలి ఏకాదశి విశిష్టత..!!

శ్రీ మహా విష్ణువు నిద్రావస్తలోకి వెళ్లే తొలి ఏకాదశి విశిష్టత..!! ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి. దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్య మాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే 'విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక' మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.

గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు అందుకనే ఆయనకు మనం తొలిపూజ చేసిన అనంతరమే శుభకార్యాలను ప్రారంభిస్తాం. గణనాధుడికి ఏకదంతమే వుండటం విశేషం. అందుకే స్వామిని ఏకదంతాయ నమః అని పూజిస్తాం. ఆ జగన్మాత పార్వతీదేవి తనయుడైన వినాయకునికి ఏకదంతుడు అని పేరు రావడం వెనుక ఒక కథ వుంది. బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలో స్వామికి ఏకదంతం ఎలా ఏర్పడింది అన్న అంశంపై వివరాలున్నాయి. ఒకసారి పరశురాముడు ఆదిదంపతుల దర్శనార్థం కైలాసానికి వస్తాడు. అయితే వారు ఏకాంతంలో వున్నారని భంగం కలిగించకూడదని వినాయకుడు అతనిని వారిస్తాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగుతుంది. గణేశుడు ఎంత సౌమ్యంగా చెప్పినప్పటికీ పరశురాముడు గండ్రగొడ్డలిని విసరబోయే యత్నం చేస్తాడు.

ఇంతలో కార్తికేయుడు ప్రవేశించి గురుపుత్రుడిపై ఆగ్రహం వ్యక్తంచేయడం సబబుకాదని హితవు పలికాడు. అయినా పరశురాముడు గొడ్డలి విసిరేందుకు సిద్ధమవుతాడు. దీంతో వినాయకుడు తన తొండాన్ని కొన్ని వందల యోజనాలు పెంచి పరశురాముడిని పట్టుకొని గిరగిరా తిప్పాడు. ఒకసారి ఎత్తుకొని పద్నాలుగు లోకాలను చూపిస్తూ తొండంతో తిప్పాడు.

దీంతో భార్గవరాముడు భీతిచెందాడు. అనంతరం సముద్రాల నీటిని తొండంతో పీల్చివేసిన గణపతి ఒక్కసారిగా అన్నింటిని వెదజల్లి పరశురాముడిని అందులోకి విసిరివేశాడు. సాగరంలో పడ్డ జమదగ్ని పుత్రుడు వెంటనే ఈదుకుంటూ బయటకు వచ్చి పట్టరాని ఆగ్రహంతో గొడ్డలిని విసిరాడు. ఆ పరశువు వేగంగా వెళ్లి వినాయకుడి ఒక దంతాన్ని నరికి తిరిగి అతన్ని చేరుకుంది.

ఈ గొడవకు పరమేశ్వరుడు, పార్వతీలు బయటకు వచ్చారు. తన ముద్దుల తనయుడికి ఒక దంతం లేకపోవడం గమనించిన జగన్మాత ఏం జరిగిందని మురుగన్‌ను అడుగుతుంది. అతను మొత్తం సంఘటనా వివరాలను తెలపడంతో అమ్మ ఉగ్రరూపం దాల్చి పరశురాముడిని శపించేందుకు సిద్ధమవుతుంది. పరశురాముడు తనను క్షమించమని అమ్మను వేడుకోవడంతో ఆమె శాంతిస్తుంది.

అతను కూడా తన తనయుడి లాంటి వాడే కాబట్టి జగన్మాత అతన్ని క్షమించింది. ఒక దంతం అలా పోవడంతో స్వామి ఏకదంతుడిగా పేరుపొందారు. నిత్యం పూజలందుకుంటూ యావత్‌ విశ్వాన్ని పరిరక్షిస్తున్నారు.

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్‌ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి.

అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.

ఆంజనేయ స్వామి అవతారాలెన్నో తెలుసా..?
ఆంజనేయ స్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయ స్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు. అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయ స్వామి
2. వీరాంజనేయ స్వామి
3. వింశతి భుజ ఆంజనేయ స్వామి
4. పంచముఖ ఆంజనేయ స్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయ స్వామి
6. సువర్చలాంజనేయ స్వామి
7. చతుర్బుజ ఆంజనేయ స్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు.

పంచముఖ ఆంజనేయ స్వామి
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి:

1. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.