సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, July 7, 2016

పరమేశ్వరుని సృష్టి



యావత్‌ విశ్వంలో సాక్షాత్తూ పరమేశ్వరుని సృష్టిగా వారణాసిని పేర్కొంటారు. ఆ లయకారకుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశీ క్షేత్రంలో జనజీవితం విరాజిల్లుతోంది. పగలు, రాత్రి అని తేడా లేదు నిత్యం వేలాదిమంది యాత్రికులతో సందడిగా వుంటుందీ ఈ దివ్యక్షేత్రం. ద్వాదాశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథక్షేత్రంగా, విశాలాక్షి వెలసిన పవిత్రభూమిగా, అన్నపూర్ణ నేలగా ఈ క్షేత్రం పేరుపొందింది. కాశీ అంటే పవిత్రక్షేత్రం. ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. వేల ఆలయాలు, గంగా హారతి కార్యక్రమం, నిత్య పూజలు, భజనలు, అర్చనలు, భక్తుల రాకపోకలతో ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గుబాళిస్తువుంటుంది.
అందుకనే కాశీయాత్ర గురించి మన పూర్వీకులు కథలు కథలుగా చెబుతుంటారు. కాశీమజిలీ కథలు కూడా ఈ యాత్రావిశేషాలను వెల్లడిస్తూ రాసినవే. 'కాశ్యాన్తు మరణాన్‌ ముక్తి' కాశీలో కన్నుమూస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కాశీ విశ్వనాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశిష్టమైనదిగా కాశీ విశ్వనాథుడిని పేర్కొంటారు. పవిత్ర గంగానదీ తీరాన వున్న ఈ మందిరంలో స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆలయం పలు దండయాత్రల్లో శిథిలమయింది. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాభాయి హోల్కార్‌ ఆలయాన్ని పునరుద్ధరించారు. రుగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కందపురాణంలోని కాశీఖండంలో ఈ ఆలయం గురించిన వివరాలున్నాయి. గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచిది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథుని మందిర నమూనాలో దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా వీక్షించాలి.

కాశీ విశాలాక్షి
ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసారు. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికి ఈ క్షేత్రం ఆరాధ్యనిలయం. ఆ ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి.
అన్నపూర్ణ ఆలయం
సకల ప్రాణకోటికి చోదకశక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాతేఅందిస్తుంది కనుకే అన్నపూర్ణ మాతగా పిలుస్తారు. ఆమె కరుణా, కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తే అన్నపూర్ణ మాతగా కాశీక్షేత్రంలో వెలిశారు. రామ భక్త హనుమాన్‌ ఆలయం సంకట్‌మోచన్‌ మందిరాన్ని కూడా వీక్షించాలి.
ఆదిశంకరుని రచనలు...
ఆద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరులకు ఈ నగరంతో మంచి అనుబంధముంది. ఆయన ఇక్కడే బ్రహ్మసూత్రాలు, భజగోవిందం ... తదితర గ్రంథాలు రచించారు. రామకృష్ణపరమహంస, కబీర్‌, తులసీదాస్‌, రవిదాస్‌...ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తమ ప్రసంగాల్లో, రచనల్లో విశేషంగా ప్రస్తావించారు.
అంతిమ సంస్కారాలకు నిలయం..
కాశీలో కన్నుమూస్తే శివసాయుజ్యం పొందుతారని ఆర్యోక్తి. దీంతో వయోధికులు అనేకమంది కాశీలోనే తమ అంత్యజీవితాన్ని గడపాలని వస్తుంటారు. గంగాతీరంలో 80కు పైగా ఘాట్లు వున్నాయి. వీటిలో దశాశ్వమేధ్‌ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌... ముఖ్యమైనవి. దశాశ్వమేథ్‌ఘాట్‌లో బ్రహ్మదేవుడు పది అశ్వమేధయాగాలను నిర్వహించినట్టు పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘాట్‌లోనే గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. మణికర్ణికఘాట్‌ను మహావిష్ణువే నిర్మించినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఘాట్‌ను నిర్మిస్తుండగా విష్ణువు కుండలం ఇందులో పడిపోయింది. అందుకు అంత పవిత్రమైన ప్రదేశంగా భాసిల్లుతోంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో మహేశ్వరుడు తారక మంత్రాన్ని చెబుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిశ్చంద్రఘాట్‌లో హరిశ్చంద్రుడే కాటికాపరిగా బాధ్యతలు నిర్వహించడంతో ఆయన పేరు మీద ఘాట్‌కు పేరు వచ్చింది.
అన్ని మతాలకు పవిత్రభూమి..
కాశీ కేవలం హిందువులకే కాదు బౌద్ధం, జైన మతాలకు పవిత్రభూమి. బౌద్దులకు పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జైన మత 23 తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించడంతో జైనులకు పవిత్రక్షేత్రమైంది. కాశీ సమీపంలోని సారనాథ్‌లో బుద్ధుడు తొలి ప్రసంగం చేశారు. మన జాతీయ చిహ్నమైన మూడు సింహాల స్థూపం ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది.
ఎలా చేరుకోవచ్చు
* దేశంలోని అన్ని నగరాలతో ఈ నగరానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* వారణాసి సమీపంలోని మొగల్‌సరాయ్‌ పెద్ద జంక్షన్‌. నిత్యం అనేక రైళ్లు ఈ రైల్వేస్టేషన్‌ ద్వారా వెళుతుంటాయి.
* వారణాసి విమానాశ్రయాన్ని అన్ని నగరాలతో విమాన సర్వీసులతో అనుసంధానించారు

సర్వం జగన్నాథం

సర్వం జగన్నాథం
ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.
వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ
జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి
భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత
అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఆషాఢ శుద్ధవిదియ... పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది.
జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ
నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం
కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం
అపురూపం. స్వరం జగన్నాథం.
రెండు నెలల ముందే...
జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ
బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072
ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి
అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు.
వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ
వినియోగిస్తారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల
ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో 'నందిఘోష'ను
అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న
నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న
నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు.
ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.
విదియనాడు...
మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే
'మనిమా(జగన్నాథా)' అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు,
అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే
బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో
బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి
అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో
సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం
ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ
ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు
విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని
తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ
జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... వూరేగింపు
నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
రాజే బంటు...
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా... పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి
నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం
స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ
అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర
మొదలవడమే తరువాయి.
జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి... జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ
తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ(ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది.
లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర
అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు.
అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి
కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా
ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి
తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని
బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు
ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు
భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా
స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.
స్థలపురాణం
ఇంద్రద్యుమ్నుడనే మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా
మలచమనీ ఆజ్ఞాపించాడట. కానీ అలా నదీతీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు
దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి... ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. కానీ తాను తలుపులు
మూసుకుని ఈ పని చేస్తానని తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. కానీ 15 రోజుల తర్వాత... ఉత్సుకతను
ఆపుకోలేని రాజు తలుపులు తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ
జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం.
ఎందుకంటే..?
రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు
బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ
రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన
ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక
మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని
రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం
అన్నమాట!
ఎలా చేరుకోవాలి
ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.