సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, August 14, 2016

కుక్కె సుబ్రమణ్య

కుక్కె సుబ్రమణ్య
జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.
ప్రకృతి ఒడిలో...
పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర
సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.
నాగులకు రక్షకుడు:
నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.
ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు..
ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి... తదితర పూజలను నిర్వహిస్తారు.
కుమారధారలో పవిత్రస్నానం..
శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
ఎలా చేరుకోవచ్చు..
మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.మంగళూరు రైల్వేస్టేషన్‌ , బస్‌స్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు సుబ్రమణ్య మీదుగా వెళుతాయి.

స్వామివారి "పెళ్లి పిలుపు"

స్వామివారి 'పెళ్లి పిలుపు!'
లోకకల్యాణ కారకుడే, తన కల్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తూ... లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా... అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్ఫై అయిదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు!
పండగంటే ఒకరోజు, మహా అయితే మూడురోజులు. అహోబిలం పరిసరాల్లోని ముప్ఫై అయిదు గ్రామాల్లో మాత్రం... ఆ ఉత్సవాన్ని నలభై అయిదు రోజులు జరుపుకుంటారు. ఆ ఒకటిన్నర నెలా... ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులూ బంధుమిత్రులతో వూళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలూ గాజులూ చిరుతిళ్ల అంగళ్లే! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రమిది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు.

ఉత్సవ చరిత్ర
'పరి' అంటే గుర్రం. స్వామివారు క్రూరమృగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరడాన్నే పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. 'గ్రామ గ్రామానికీ నన్ను తీసుకెళ్లండి. నా పాదపద్మాల్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి' అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్టు అహోబిల క్షేత్ర మహత్యంలో పేర్కొన్నారు. నా పెళ్లికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని కూడా అన్నారట. ఆరువందల సంవత్సరాల క్రితం, ప్రథమ పీఠాధిపతి శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచీ నేటి వరకూ పార్వేటోత్సవాలు 45 రోజుల పాటూ 35 గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి. ఆతర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో (మార్చి 17) వేడుకలు పూర్తవుతాయి.
స్థానిక ఐతిహ్యం...
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి... వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు. 'పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను' అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.
పారువేటోత్సవాలు...
స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో 'తెలుపు'లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే 'తెలుపు.. ఎరుపు' రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచీ ఆ కుటుంబాలవారే మోస్తున్నారు. వీరిని బోయీలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు, టి.లింగందిన్నెలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచీ మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకూ..ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచీ వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీపడతారు.
దర్శన భాగ్యం ఇలా...
పారువేటోత్సవాల్లో భాగంగా స్వామి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందికి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవతంతు ముగుస్తుంది. ఆ 45 రోజులూ ప్రతి గ్రామంలోనూ పండుగే. స్వామి తమ వూరికి వచ్చాడంటే ప్రజలకు పట్టరాని ఆనందం. వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే వేయి దుకాణాలు వెలుస్తాయి. రోజూ కనీసం రూ.25 లక్షల వ్యాపారం జరుగుతుంది. వారంలో దాదాపు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 'ఆరువందల ఏళ్లుగా... ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే' అంటారు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్‌. అహోబిలం.. నంద్యాల నుంచి అరవై కిలోమీటర్లూ, కర్నూలు నుంచి దాదాపు నూటనలభై కిలోమీటర్లు.

వేంకటేశ్వరస్వామి ఏ రూపం?

వేంకటేశ్వరస్వామి ఏ రూపం?
విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
వేంకటేశ్వరస్వామి విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
తిరుమలేశుని విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభరణాలు, ఆలయగోపురంపై శక్తి వాహనమైన సింహం.. ఇలా విభిన్నదేవతా చిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. ''ఇరుండరువురం ఒండ్రాయ్‌ ఇసైందు'' (ఇరుమూర్తులూ నీయందే ఉన్నాయి) అంటూ పెయ్‌ ఆళ్వార్‌ నోరారా కీర్తించాడు. ''స్కంధ విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరతః'' అని స్కంధ పురాణం చెబుతోంది.అంటే శ్రీవారి మూర్తి స్కంధ, విష్ణు, శక్తి ఈ మూడు తత్వాలనూ కలిగి ఉన్నది. సప్తర్షులకూ ఏడురూపాల్లో సాక్షాత్కరించిన
సత్యస్వరూపుడు వేంకటేశ్వరుడు. ఇలా చాలానే ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ.. మనకున్న పద్దెనిమిది పురాణాలకుగాను 12 పురాణాల్లో శ్రీవారు విష్ణురూపమేనని చెబుతున్నాయి. కాబట్టి స్వామి నిస్సందేహంగా విష్ణురూపమే. అదీ సర్వదేవతా సమన్వయ స్వరూపం. అంటే ముక్కోటి దేవతలూ స్వామియందే ఉన్నారని అర్థం. ''హరి అవతారములే అఖిలదేవతలు'' అని అన్నమాచార్యులవారు చెప్పిందీ అదే కదా!

ఎంత గొప్పవాడండి రాముడు

ఎంత గొప్పవాడండి రాముడు

రావణాసుడు సీతాదేవిని తీసుకు వెల్లినపుడు సమస్త ప్రానలు చూశాయ్. కాని రాముడు అడిగినప్పుడు ఏ ఓక్క చెట్టు గాని ,అడవి గాని,ప్రాని గాని చెప్పలేదు .ఎందుకో తెలుసా చెప్తె రావణాసురుడు ఎక్కడ చంపేస్తాడో అని.
కోపం ఆపుకోలేక రాముడు లక్ష్మణుడితో నేను రామ బాణం వేస్తాను ఈ సమస్త ప్రాణులను , ఆకరికి దేవుళ్ళను  కూడ బంథీ చేస్తానని కోపంతో ఊగిపోతుంటాడు.తమ్ముని మాట విని ఆగిపోతడు.
" క్షణకాలం కోపంతో ఎంతో  గోప్ప పేరున్న రాముడు పాతాలానికి వెళ్ళేవాడు. ఆ కోపాన్ని జయంచటం వల్లే రాముడు దేవుడయ్యాడు."

రుద్రేశ్వరాలయం

రుద్రేశ్వరాలయం
పంచాక్షరీ మంత్రం మారుమోగినచోట శతాబ్దాలపాటూ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. నరపతులూ గజపతులూ కొలిచిన శివలింగం శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో... కొండపాక ప్రజలు కొండంత చారిత్రక స్పృహతో వ్యవహరించారు. రుద్రేశ్వరాలయాన్ని పునర్నిర్మించుకున్నారు.
కతీయ నిర్మాణశైలి... అలనాటి శిల్పకళా ప్రతిభకు తార్కాణం! అందమైన స్తంభాలూ, అంతెత్తు ద్వారాలూ, గర్జించే సింహాలూ, పురాణ గాథలూ - ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. రాతితో మలచిన రమణీయ కావ్యాలవి! మెదక్‌జిల్లా కొండపాకలోని రుద్రేశ్వరాలయమూ ఆ శిల్పకళారీతికి ప్రతీకే. సుమారు 820 సంవత్సరాల నాటి ఈ క్షేత్రం అనేకానేక కారణాలతో శిథిలావస్థకు చేరుకుంది. తాతముత్తాతలు కథలుకథలుగా చెప్పిన ఓ మహాలయ వైభవం మట్టికొట్టుకుపోతుంటే కొండపాక గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఆ వారసత్వ సంపదను కాపాడుకోవాలని తీర్మానించారు. వ్యయప్రయాసలకోర్చి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు.

తూర్పునకు అభిముఖంగా ఉన్న ఆలయంలోకి వెళ్లగానే...మధ్యలోని మంటపంలో శివలింగ స్వరూపంలో రుద్రేశ్వరుడు దర్శనమిస్తాడు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలోని ప్రాణవట్టం నమూనాలోనే ఇక్కడి ప్రాణవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడికి పేరు! ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో శివపంచాయతనంతోపాటూ కన్యకాపరమేశ్వరి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, మార్కండేయుడు, వీరభద్రుడు, త్రిమాతలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కొలువై ఉన్నాయి.
సైనికులే నిర్మించారు!
ఆలయ చరిత్రనంతా ఇక్కడున్న శాసనాల్లో నిక్షిప్తం చేశారు. రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో...కాకతీయుల కొలువులో పనిచేసిన ముప్ఫైమంది సైనికులు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆ ప్రకారంగా, రుద్రేశ్వరాలయ నిర్మాణం క్రీ.శ 1194లో జరిగింది. ప్రాంగణంలోనే త్రికూటేశ్వర (సూర్య-శివ-అంబిక) ఆలయమూ ఉండేదట. గణపతిదేవుడు పాలిస్తున్న కాలంలో... డెబ్భై గ్రామాలపై అధికారమున్న ఆదిత్య అమాత్యుడు త్రికూటేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ గుడి పూర్తిగా శిథిలమైపోయింది. సమష్ఠి కృషితో...రుద్రేశ్వరాలయానికి వైభవాన్ని తీసుకొచ్చిన గ్రామస్థులు, త్రికూటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికీ నడుంబిగించారు.
కోరికలు తీర్చే దేవుడు!
ఆలయంచుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి, శివుడి ఎదురుగా ఉండే నందికేశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా... జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు, రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. వందేళ్లక్రితం ఓసారి, ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్థులు సహస్ర ఘటాభిషేకం (వెయ్యి బిందెలతో గర్భాలయంలో నీళ్లు నింపడం) చేశారట. వెంటనే కుండపోత వర్షం కురిసి ... కరవు కనిపించకుండా పోయిందట! ఈ ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మించాలని మొదట సంకల్పించింది కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ. సంకల్పించడమే కాదు, కొంత మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తూ పనులు ప్రారంభించకుండానే ఆయన కన్నుమూశారు. తర్వాత ఓసారి... శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధిపతులు మాధవానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆలయ చరిత్ర గురించి విన్నారు. గ్రామస్థుల్ని సమావేశపరచి, పునః ప్రతిష్ఠాపనకు ప్రేరణ కలిగించారు. పల్లెజనమంతా కలిసి కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి, చారిత్రక ఆలయానికి జీవంపోశారు.
రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణం 2006 ఆగస్టులో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణ శైలికి ఏ భంగమూ వాటిల్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు నుంచి నిపుణులైన శిల్పులను పిలిపించారు. ఆ కార్యక్రమానికి ఓ రూపం రావడానికి ఆరేళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు. లింగాన్ని కళావరోహణం చేశాక... మళ్లీ ప్రతిష్ఠించే వరకూ జలాధివాసంలోనే ఉంచారు. ఆ ఆరేళ్లూ అఖండదీపం వెలిగించారు. అప్పటి రాతి ధ్వజస్తంభం చెక్కుచెదరకుండా ఉండటంతో దాన్నే నిలబెట్టారు.
విశేష పూజలు...
రుద్రేశ్వరాలయంలో ప్రతి మాసశివరాత్రికీ మాస బ్రహ్మోత్సవాలూ మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరుగుతాయి. శివరాత్రికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామస్థులంతా ఎడ్ల బండ్లనూ వాహనాలనూ చక్కగా అలంకరించుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమం కన్నుల పండువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వెళ్లే రాజీవ్‌ రహదారిపైనే కొండపాక ఉంది. కొమురవెల్లి, సిద్దిపేట కోటిలింగాల గుడి... సమీపంలోని దర్శనీయ స్థలాలు.

చందన రూపుడు సింహాచలేశుడు

చందన రూపుడు సింహాచలేశుడు

దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి
స్వయంభువుగా
వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.

ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.
ఆలయ చరిత్ర-స్థల పురాణం
స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో.. భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా.. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (రూ.52 కోట్లు)కలిగిన దేవాలయమిదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం.
ప్రధాన పూజలు
1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
ఇతర సేవల ధరలు
* సహస్రనామార్చన: రూ.200
* అష్టోత్తర శతనామార్చన: రూ.100
* లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
* గరుడ సేవ: రూ.300
* కప్పస్తంభ ఆలింగనం: రూ.25
* లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
* గోపూజ: రూ.50
* గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
* పశువుకట్టు: రూ.15
* అన్నప్రా శ న, అక్షరాభ్యాసం: రూ.50
* ద్విచక్రవాహన పూజ: రూ.100
* కారు పూజ: రూ.200
* కేశఖండన: రూ.10
టిక్కెట్లు దొరికే స్థలాలు: అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
ప్రసాదాల ధరలు
* లడ్డూ(80గ్రాములు): రూ.5
* పులిహోర : రూ.5
* చక్కెర పొంగలి: రూ.3
* రవ్వ లడ్డూ : రూ.2
దర్శన వేళలు
* ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
* మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
* మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
* సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
* రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
* రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
* రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
* మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల ధరలు
* రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
* రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
* రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.
రవాణా సౌకర్యం
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేకసందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
వసతి వివరాలు
కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్టు రెస్ట్‌ హౌస్‌, తితిదే సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో వున్నాయి.
ఇతర దర్శనీయ స్థలాలు
ఆండాళ్‌ సన్నిధి(గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు
ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్‌, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడమూ సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు..