సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, October 23, 2016

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం'!!
హిందూ దేవాలయాలు చాలా చోట్ల వున్నాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని, అది కాంభోజ దేశంలో వుందని అంటున్నారు. 'ఆంగ్కోర్ వాట్' 'ఆంగ్కోర్ వేట్' ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా(ప్రాచీన నామం 'కంపూచియా') లోని అంగ్ కోర్ వద్ద 12వ శతాబ్ధంలో సూర్యవర్మన్ నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించారట. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం ఇది. భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే అసలు విషయానికొస్తే.. పూర్వకాలంలో కాంభోజ దేశం అని పిలిచేవారు..

ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంభోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది. పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్ధాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని..
చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన కాముతో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్ధాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది.

జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే..
సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్ కోర్ వాట్ దేవాలయం ఒకటి. ఆంగ్ కోర్ వాట్ దేవాలయం కంపూచియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది.

క్రీ.శ. 12వ శతాబ్ధకాలంలో ఆంగ్ కోర్ వాట్ ను రాజధానిగా చేసుకుని..
ఈ ఆలయానికి కొన్ని దశాబ్ధాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ. 12వ శతాబ్ధకాలంలో ఆంగ్ కోర్ వాట్ ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి.

భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి..
టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా వుంటాయని చెబుతున్నారు.

భూమి మీద ఉన్నప్పుడే ఈ రుణాలు తీరుస్తే నేరుగా స్వర్గానికి వెళ్తారట!

భూమి మీద ఉన్నప్పుడే ఈ రుణాలు తీరుస్తే నేరుగా స్వర్గానికి వెళ్తారట!
హిందూ సాంప్రదాయంలో ఎన్నో అంశాలు ఇటు ఆరోగ్య పరంగా, అటు ముక్తిపరంగా పొందుపరిచారు. అయితే చాలామందికి తెలియని ఆచార వ్యవహారాలు, పద్ధతులు, సంస్కారాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. కొంతమంది పాటిస్తున్నా, ఎందుకు పాటిస్తున్నామో తెలీని పరిస్థితి వుంది. చాలా మటుకు భక్తులు చేసే కార్యక్రమాల్లో ప్రతి దాని వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. దీని గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఏ కార్యక్రమాన్ని, ఏ పూజను ఎందుకోసం చేస్తామో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అలాంటి వాటిలో ముఖ్యంగా హిందువులు నిర్వహించే శ్రాద్ధ కర్మల క్రియ కూడా ఒకటి. ఇంతకీ ఈ కర్మలను ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం..

1.ఋషి ఋణం:-
మహాభారతంలో శ్రాద్ధ కర్మల గురించి వివరంగా ఉన్నట్టు పలువురు పండితులు చెబుతున్నారు. ప్రధానంగా 3 రకాల రుణాలను తీర్చుకోవడానికి ఈ శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారట.
మనిషి తాను జీవించి ఉన్నంత కాలం దాన ధర్మాలు చేస్తే ఈ రుణం తీర్చుకున్నట్టు అవుతుందట. అలా చేయలేని వారు ఒక వేళ చనిపోతే వారి కుటుంబ సభ్యులెవరైనా శ్రాద్ధ కర్మలు చేస్తే అప్పుడు ఆ రుణం తీర్చుకున్నట్టేనని, అప్పుడు వారికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు.

2.దేవ ఋణం:-
మనిషి బతికి ఉన్నప్పుడు తాను సంపాదించే జ్ఞానాన్ని ఇతరులకు పంచితే ఈ రుణం తీర్చుకున్నట్టు అవుతుందట. ఇక ఒక వేళ ఎవరైనా ఇలా కూడా చేయలేకపోతే వారు చనిపోయాక వారి కుటుంబ సభ్యులు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అప్పుడు ఈ రుషి రుణం కూడా తీరినట్టు అవుతుందని పెద్దలు చెబుతున్నారు.

3.పితృ ఋణం:-
ఈ రుణం తీరాలంటే మాత్రం చనిపోయిన వారికి కచ్చితంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. తర్పణాలు, పిండ ప్రదానాలు చేయాల్సిందేనట. అప్పుడే 3 రుణాలు తీరినట్టయి చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందట. భూమిపై నివసించే వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుందట. అందుకే ఎవరైనా తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించకుండా చనిపోతే, వారి పేరిట ఇప్పుడున్నవారు శ్రాద్ధ కర్మలను నిర్వహించాలట. అలా చేసినా చనిపోయిన వారి ఆత్మలు శాంతించి, ఇప్పుడున్న వారికీ మంచి చేకూరుస్తాయట.

భాద్రపద మాస మహాలయ పక్షంలోనూ..
అయితే సాధారణంగా ఎవరైనా చనిపోయిన తమ పూర్వీకులకు వారు చనిపోయిన తేదీల్లోనో, లేదంటే పుష్కరాల వంటివి వచ్చినప్పుడో తర్పణాలు వదులుతారు. పిండ ప్రదానాలు, కర్మలు చేస్తారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న భాద్రపద మాస మహాలయ పక్షంలోనూ కర్మలు చేయవచ్చట. పిండాలు, తర్పణాలు వదలవచ్చట. అలా చేసినా మంచి ఫలితమే లభిస్తుందట.

ఎవరైతే చనిపోయిన తమ పూర్వీకులకు..
ముఖ్యంగా 3 రుణాల్లోనూ పితృ రుణం తీర్చుకునే దిశగా ఎవరైతే చనిపోయిన తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుందట. అయితే అలాంటి కర్మలు నిర్వహించే స్థోమత లేని వారు మహాలయ పక్ష చివరి రోజైన మహాలయ అమావాస్య(ఈ నెల 30వ తేదీన వస్తోంది) నాడు తమ సమీపంలో ఉన్న ఏదైనా ఒక పెద్ద చెట్టు వద్దకు వెళ్లి దాన్ని ఆలింగనం చేసుకుని చనిపోయిన తమ పూర్వీకులను తలచుకుని కన్నీరైనా కార్చాలని శాస్త్రం చెబుతోంది.

పూర్వం కర్ణుడు కూడా..
అలా చేయడం వల్ల కూడా శ్రాద్ధ కర్మలు చేసినంత ఫలితం కలుగుతుందట. పూర్వం కర్ణుడు కూడా ఇదే పక్షంలో తన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలకు తర్పణాలు వదిలి, వారికి మంచి గతులు ప్రాప్తి అయ్యేలా చేశాడట. అలా చేయడం 100 యాగాలు చేసినదాని ఫలితంతో సమానమట.

శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి సత్యభామకి తెచ్చిచ్చిన పారిజాత వృక్షం

శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి సత్యభామకి తెచ్చిచ్చిన పారిజాత వృక్షం
ఈ పారిజత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామం వద్ద ఉంది. ప్రపంచంలో కెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం.

దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి, పై భాగన ఆకులు యేడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి.

పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది అదీ జూన్/జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు.

సృష్టిలో తొలి భార్యాభర్తలు ... మనకు తెలీని రహస్యాలు

సృష్టిలో తొలి భార్యాభర్తలు ... మనకు తెలీని రహస్యాలు
మన సృష్టి అనంతమైనది. ఎన్నో కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి. గాలి, నీరు, అగ్ని , వాయువు , భూమి , ఆకాశం .. ఈ ఐదూ పంచభూతాలు. ప్రక్రుతి స్త్రీ వంటిది, నేను పురుషుడిని అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో స్పష్టంగా చెప్పాడు కూడా. అయితే ఈ సృష్టిలో ముందు ఎవరు , తొలి భార్యా భర్తలు ఎవరు ఇలాంటి సందేహాలు రావచ్చు. అయితే వాటి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
ముందు పుట్టింది నీరు..
సృష్టిలో మొదట పుట్టింది నీరు. ఇక నారా అంటే నీరని అర్థం. నీటినుండి పుట్టినవాడే నారాయణుడు.

ఆది దంపతులు శివ పార్వతులే..
సృష్టిలోని తొలి దంపతులు పార్వతీ పరమేశ్వరులు.

తొలి పెళ్లి కూతురు గౌరీదేవి..
సృష్టికే తొలి ప్రకృతి - స్త్రీమూర్తి శక్తి (పార్వతి) కి మరో పేరు గౌరి. అందుకే హిందూ వివాహా కార్యక్రమంలో పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయించే ఆచారముంది. లక్ష్మి పూజ కాని, సరస్వతి పూజగాని చేయించరు. సృష్టికి తొలి పెళ్ళికూతురు గౌరిదేవి మాత్రమే.
లింగాకారం శివాలయాల్లో శివుడు లింగాకారంలో ఉంటాడు. లింగ అకారానికి క్రిందిభాగములో ఆవృతమై ఉండే పానవట్టమే పార్వతి. శివపార్వతుల ఏకత్వ రూపమే శివలింగం.

శివ పార్వతులు సమానం..
శివుడు లేక పార్వతి లేదా ఈశ్వరి... అన్నీ సమానమే అందుకే ఈశ్వరి లేకుండా శివుడు, శివుడు లేకుండా ఈశ్వరి ఉండరు. ఉండలేరు.

సృష్టికి స్వరూపం శివలింగమే..
అసలు శివలింగమే సృష్టి స్వరూపం. స్త్రీ పురుషుల సంగమాన్నే శృంగారం అంటారు. శివలింగాన్ని పూజిస్తే ఈశ్వరి ఈశ్వరులను, లేదా పార్వతి పర మేశ్వరులను, సృష్టిని, సృష్టి కార్యాన్ని అంటే ప్రకృతి - పురుషులను శృంగారాన్ని పూజించినట్లే.

అర్ధనారీశ్వరుడు..
అందుకే, పార్వతికి ఒక ఆలయం, పరమేశ్వరునికి ఒక ఆలయం విడివిడిగా నిర్మించరు. ఆన్యోన్య దాంపత్యానికి, అనురాగజీవితానికి, శాశ్వతబంధాన్ని కోరుకునే వారు శివాలయంలో శివపార్వతులను పూజిస్తారు. శివుడు తన భార్య అయిన పార్వతికి తనదేహంలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు.

శక్తి ప్రదాత పార్వతి..
మనిషికి వార్ధక్యములో(వృద్ధాప్యంలో) లక్ష్మి, సరస్వతులతో పనిలేదు. అంటే డబ్బు, చదువు తో అవసరం చాలా తక్కువ. పనంతా శక్తి తోనే కదా! ఇంతకీ పార్వతి శక్తి ప్రదాత కదా. అందుకే ప్రార్ధనలు అన్నీ పార్వతి కే. అందుకే

" వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే, వందే పార్వతీ పరమేశ్వరౌ' అని అన్నారు.
శృంగారానికి దైవత్వం - శివపార్వతులే కర్తలు

దేహం శుష్కించి నరాలు బలహీనమై లేవలేని మనిషికి కావలసింది శక్తి. ఆ తరవాత మోక్ష మిచ్చే దేవత కూడా మహాశక్తియే. ఆ సామర్ధ్యం పార్వతికే ఉంది. సృష్టి లాగే లయత్వానికి కూడా శివపార్వతులే కర్తలు. వారి చేసే కర్మే శృంగారం. దాని ప్రతీకే బిడ్డలు. వీ రి పుట్టుకకై చేసే శృంగారానికి దైవత్వముంది.

ఏకైక నరముఖ వినాయక దేవాలయం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా?

ఏకైక నరముఖ వినాయక దేవాలయం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా?
వినాయకుడు పార్వతి దేవి-శివునికి జన్మించారు. అయితే వినాయకుడు మొదట నర ముఖంతోనే జన్మించారు.. కానీ గజాసురుడు అనే రాక్షసుడికి, ముఖ భాగము గజము, క్రింది భాగము నరుడు అయిన రూపం గల వాని చేతిలోనే వరం ఉండడంతో, ఈశ్వరుడు నర ముఖం తొలగించి, గజ ముఖంతో ప్రాణ ప్రతిష్ఠ చేశారట. ఆ తరువాత ఆ రాక్షసుడిని వినాయకుడు సంహరించారట. లోక కల్యాణం కోసం తన తలను తొలగించి, గజము యొక్క తలను ధరించారు కాబట్టే సుముఖము అన్నారు.

ఏ ముఖము ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము సుముఖము అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమష్కరిస్తే, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అంటారు..

లక్ష్మీదేవి 5 ప్రదేశాలలో స్ధిర నివాసం ఉంటుంది..
1. ఏనుగు కుంభ స్ధలంలో
2. ఆవు వెనుక తట్టులో
3. తామర పుష్పములో
4. బిల్వ దళంలో
5. పాపిట బొట్టు పెట్టుకునే స్ధలంలో ఉంటారని చెపుతారు.
తిరుచ్చిలోను, చిదంబరములోను నర వినాయక విగ్రహాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప గుర్తు పట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన్ని అందరూ గజ ముఖముతోనే చూసారు కాబట్టి నర ముఖం ఎవరికీ తెలియదు కాబట్టి గుర్తు పట్టడం కష్టం..
అనుకున్నవేవీ జరగడం లేదా? అయితే ఈ పూజ చెయ్యండి ఇక అంతా శుభమే!!
కొందరు ఏ పని చేపట్టినా ఈజీగా అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ కొందరికి ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారంగా తరుణ గణపతిని పూజించమని అంటారు.

వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. అందుకే తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. ఈ రూపంలో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ, ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు. తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది.

ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం నెరవేరతాయి. స్కాంద పురాణంలోనూ, బ్రహ్మ పురాణంలోనూ, వామన పురాణంలోనూ ముద్గళ పురాణంలోనూ తరుణ గణపతిని గురించిన ప్రస్తావన ఉంటుంది.

తరుణ గణపతి ధ్యానం:
అధ తరుణ గణపతి ధ్యానం ముద్గళ పురాణే
శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూపకపిద్ధజంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః

ఇక ప్రతిరోజూ ఉదయం స్నానాదికాలు ముగించుకుని, శుభ్రమైన వస్త్రాలను ధరించి, తరుణ గణపతి ధ్యానం చేయడం వలన సర్వకార్య సిద్ధి కలుగుతుందని చెబుతారు. ఇక ఎందుకు ఆలస్యం వెంటనే తరుణ గణపతిని ఆరాదించేయండి.

అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

హనుమంతుడు పరమ రామ భక్తుడు. ఎక్కడ రామా అంటే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడైనా తదేకంగా రామ నామ జపం జరుగుతుంటే, అక్కడికి హనుమంతుడు కూడా వచ్చి కూర్చుంటాడని అంటారు. అలాంటి హనుమంతుడు జయ మంత్రం చెప్పాడంటే, అందులో ఖచ్చితంగా రామనామం ఉంటుంది.

జయ మంత్రము:
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|

హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||

అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|

సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

మంత్రము యొక్క అర్ధం:
'రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు' అని జయ మంత్రాన్ని చెప్పాడు.

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టాలంటే

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టాలంటే.......!!
దారిద్ర్యం తొలిగి లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలామందికి వుంటుంది. ఇళ్లు, అలవాట్లలో వున్న దారిద్రమే అలక్ష్మీ నివాసం. అందుకే ఇల్లు పవిత్రంగా, పరిసరాలు శుభ్రంగా వుంటే లక్ష్మీదేవి నడిచి వస్తుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు వుంటే ఇల్లు అందంగా వుండదు. చెప్పులకున్న చెడు వలన క్రిములు, కీటకాలు చేరుతాయి. అంతా చెత్తగా వున్నప్పుడు అనారోగ్యం, అనారోగ్యంతో డబ్బులు, ఆరోగ్యం మనశ్శాంతి పోతాయి. ఇంతకన్నా దారిద్య్రం ఏం వుంటుంది. అలాగే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేయక పోవడం, చెత్త ఇంట్లోనే వుంచుకోవటం, అంట్లూ చాలా సేపు తోమకుండా వుండటం ఇవన్నీ లక్ష్మీ దేవి మన ఇంటికి రాకుండా అడ్డుపడే అంశాలే. ఆవిడ అపరిశుభ్రంగా వున్న ఇంట అడుగుపెట్టదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలన్నా, దరిద్ర దేవతను పారద్రోలాలన్నా శుభ్రత, నియమాలు పాటించడం ఒక్కటే మార్గం..

శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి భక్తి పాట

శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి భక్తి పాట 


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోకుంభాంతరీ
కాశ్మీరాగారు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసచల కందరాలయకరీ గౌరీహ్యుమా శాంకరీ
కౌమారీ నిగామార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీవిశ్వేశ మనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంత సమస్తవన్నకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దర్వీ సర్వ విచిత్రరత్నఖచితా దాక్షాయణీ సుందరీ
వామం స్వాడుపయోధర ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ వారా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రార్కానాల సమానకుంతలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలపుస్తక పాశమంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే
శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షాం దేహి చ పార్వతీ

మాతా చ పార్వతీ దేవీ
పితా దేవో మహేశ్వరః
బాంధవాశ్శివ భక్తాశ్చ
స్వదేశో భువనత్రయం

విష్ణువు రాముడిగా అవ‌తారం ఎత్త‌డానికి అస‌లు కార‌ణాలు ఏమిటో తెలుసా.?

విష్ణువు రాముడిగా అవ‌తారం ఎత్త‌డానికి అస‌లు కార‌ణాలు ఏమిటో తెలుసా..?


మాన‌వాళిని ర‌క్షించేందుకు ఆయా దేవుళ్లు, దేవ‌త‌లు ప‌లు అవ‌తారాలెత్తి రాక్ష‌సుల‌ను సంహరించిన‌ట్టు హిందూ పురాణాల్లో ఉంది. దీని గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయా అవ‌తారాల్లో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన వాటిలో రామావ‌తారం కూడా ఒక‌టి. శ్రీ‌మ‌హావిష్ణువు రాముడిగా జ‌న్మించి రావ‌ణాసురున్ని, ఇత‌ర రాక్ష‌సుల‌ను చంపి మాన‌వాళిని ర‌క్షించాడ‌ని రామాయ‌ణంలో ఉంది. అయితే విష్ణువు శ్రీ‌రాముడిగా జ‌న్మించ‌డం వెనుక మ‌రికొన్ని క‌థ‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌మ‌హావిష్ణువు శేష‌త‌ల్పంపై పాల‌స‌ముద్రంలో శ‌య‌నించి ఉండ‌గా ఆయ‌న మందిరానికి కాప‌లాగా ఇద్ద‌రు ర‌క్ష‌కులు ఉంటారు. వారే జ‌య‌, విజ‌య‌. ఈ క్ర‌మంలో ఒకానొక సంద‌ర్భంలో విష్ణువును క‌లిసేందుకు ఓ ముని అక్క‌డికి వ‌స్తాడు. అయితే జ‌య‌, విజ‌య‌లు అత‌న్ని లోప‌లికి అనుమ‌తించ‌రు. దీంతో ఆగ్రహించిన ముని వారిద్ద‌రికీ రాక్ష‌సుల‌ను క‌మ్మ‌ని శాపం పెడ‌తాడు. దీంతో వారు హిర‌ణ్యాక్ష‌, హిర‌ణ్య‌క‌శ్య‌ప అనే ఇద్ద‌రు రాక్ష‌సులుగా మారి దేవ‌త‌ల‌తోపాటు స‌మ‌స్త మాన‌వాళిని అనేక చిత్ర‌హింస‌లు పెడుతుంటారు. దీంతో విష్ణువు వరాహ అవ‌తారం ఎత్తి హిర‌ణ్యాక్షున్ని, నృసింహ అవ‌తార‌మెత్తి హిర‌ణ్య‌క‌శ్య‌పున్ని హ‌త‌మారుస్తాడు. కానీ అలా చ‌నిపోయినా జ‌య‌, విజ‌య‌ల‌కు మోక్షం క‌ల‌గదు. దీంతో వారు మ‌ళ్లీ రాక్ష‌సులుగానే జన్మిస్తారు. కాగా ఈ సారి జ‌య‌, విజ‌య‌లు రావ‌ణుడు, కుంభ‌క‌ర్ణులలా పుడ‌తారు. అలా వారిని చంపేందుకు విష్ణువు రాముడి అవ‌తారం ఎత్తిన‌ట్టు చెబుతారు.

ఒక‌సారి జ‌లంధ‌రుడ‌నే రాక్ష‌సుడు దేవ‌త‌లంద‌రినీ యుద్ధంలో ఓడించి వారిని నానా చిత్ర‌హింస‌లు పెడుతుంటాడు. దీంతో వారు శివుని వ‌ద్ద‌కు వెళ్లి త‌మ‌ను ర‌క్షించ‌మ‌ని మొర‌పెట్టుకుంటారు. ఈ క్ర‌మంలో శివుడు జ‌లంధ‌రుడితో యుద్ధం చేస్తాడు కానీ అత‌న్ని గెల‌వలేక‌పోతాడు. అందుకు కార‌ణం అత్యంత ప‌తివ్ర‌త అయిన వృంద అనే భార్య ఉండ‌డ‌మే జ‌లంధ‌రుడి విజ‌యానికి కార‌ణ‌మ‌ని శివుడు తెలుసుకుంటాడు. దీంతో విష్ణువు జ‌లంధ‌రుడిగా మారువేషంలో వెళ్లి వృంద ప‌విత్ర‌త‌ను కోల్పోయేలా చేస్తాడు. ఆ క్ర‌మంలో శివుడు జ‌లంధ‌రుడితో మ‌ళ్లీ యుద్ధం చేసి అత‌న్ని ఓడించి చంపేస్తాడు. కానీ జ‌లంధరుడు రావ‌ణాసురుడిలో ఓ అంశ‌లా మళ్లీ జ‌న్మిస్తాడ‌ట‌. అప్పుడు విష్ణువు రామావ‌తారం ఎత్తి రావ‌ణాసురున్ని హ‌త‌మారుస్తాడు.

త్రేతాయుగం ఆరంభానికి కొన్ని వేల ఏళ్ల ముందు కృత యుగంలో మనువు, అత‌ని భార్య సాత్రూప అని ఇద్ద‌రు దంప‌తులు ఉండేవార‌ట‌. వారు శ్రీ‌మహావిష్ణువుకు మొద‌టి నుంచి ప‌ర‌మ భ‌క్తుల‌ట‌. కాగా వారు త‌మ వృద్ధాప్యంలో ఇంటిని విడిచిపెట్టి అడ‌వికి వెళ్లి విష్ణువు కోసం త‌పస్సు చేస్తార‌ట‌. ఈ క్రమంలో ఒక రోజు విష్ణువు ప్ర‌త్య‌క్ష‌మై ఏం వ‌రం కావాలో కోరుకోమ‌ని అడ‌గ్గా, వారు విష్ణువును త‌మ‌కు బిడ్డ‌గా జ‌న్మించాల‌ని అడుగుతార‌ట‌. దీంతో మ‌నువు ద‌శ‌ర‌థుడిగా జ‌న్మిస్తాడు. అత‌నికి విష్ణువు కొడుకుగా (రాముడిగా) జ‌న్మించి వారి వ‌రం తీరుస్తాడు.

ఒకానొక సంద‌ర్భంలో నార‌దుడు త‌పస్సు చేసుకుంటుండ‌గా మ‌న్మ‌థుడు వ‌చ్చి అత‌నిలో శృంగార భావ‌న‌లు క‌లిగేలా బాణాలు వేస్తాడ‌ట‌. అయినా నార‌దుడు చలించ‌డ‌ట‌. ఈ క్ర‌మంలో మన్మథుడిపై ఫిర్యాదు చేసేందుకు నార‌దుడు శివుడు వ‌ద్ద‌కు వెళ్ల‌గా అప్పుడు శివుడు నార‌దున్ని విష్ణువు ద‌గ్గ‌ర‌కు పంపుతాడు. విష్ణువు ఎదుట విష‌యం చెప్పిన నార‌దుడి ప్ర‌వ‌ర్త‌న చూసి విష్ణువుకు విసుగు వ‌స్తుంద‌ట‌. దీంతో నారదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాల‌నుకుని అత‌ను వెళ్లే దారిలో ఓ సుంద‌ర‌మైన అర‌ణ్యాన్ని, అందులో అద్దాల భ‌వంతుల‌ను, ర‌క‌ర‌కాల అంద‌మైన చెట్ల‌ను, పువ్వుల‌ను క‌లిగి ఉన్న తోట‌ను, ఒక అంద‌మైన యువ‌రాణిని విష్ణువు సృష్టిస్తాడ‌ట. అలా నారదుడు విష్ణువు వ‌ద్ద నుంచి బ‌య‌ల్దేరి వెళ్తుండ‌గా అత‌ను సృష్టించిన సుంద‌ర‌మైన అర‌ణ్యాన్ని, అందులోని యువ‌రాణిని చూసి ఆమెను మోహించి పెళ్లి చేసుకునేందుకు నార‌దుడు సిద్ధ‌మ‌వుతాడ‌ట‌. అప్పుడు ఆ యువ‌తి నార‌దున్ని చూసి పక ప‌కా న‌వ్వుతుంద‌ట‌. దీంతో ఆగ్ర‌హించిన నార‌దుడు అస‌లు విషయం తెలుసుకుని తాను మోహించిన యువ‌తిని పెళ్లాడ‌కుండా చేసినందుకు గాను విష్ణువు భార్య‌కు దూర‌మై విర‌హ తాపాన్ని అనుభ‌వించాల‌ని విష్ణువుకు శాపం పెడ‌తాడ‌ట‌. దీంతో విష్ణువు రాముడిగా జ‌న్మించి సీత‌కు దూర‌మై అనేక సంవత్సరాలు విర‌హ తాపంతో గ‌డిపాడని చెబుతారు.

అలా విష్ణువు రాముడిగా జ‌న్మించ‌డం వెనుక ఆయా క‌థలు దాగి ఉన్నాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.

హిమాలయాల్లోని ఆ శివలింగం ఏటా పెరుగుతుందట?

హిమాలయాల్లోని  ఆ శివలింగం rఏటా పెరుగుతుందట… అది గుహ పై భాగాన్ని తాకితే భూమి అంతా సర్వనాశనమవుతుందట.
ప్రళయాలు, ఉత్పాతాలు, భూకంపాలు వంచి ప్రపంచమంతా ఒక్కసారే తుడిచి పెట్టుకుని పోతుందనే మాటలను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఒకప్పుడు స్కైలాబ్ అనే తోక చుక్క మొదలు మొన్నా నడుమ వచ్చిన 2012, డిసెంబర్ 12 తేదీ వరకు ఆయా సందర్భాల్లో ప్రపంచం నాశనమవుతుందని పుకార్లు బాగానే వచ్చాయి. అయితే ఆయా తేదీలు గడిచిన తరువాత కానీ అవి వట్టి పుకార్లేనని ఎవరూ నమ్మలేదు. అయినప్పటికీ అధిక శాతం మంది ప్రజలు ఇప్పటికీ ప్రపంచ వినాశనం గురించిన పుకార్లను, విషయాలను అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకు నాశనం తప్పదని, భూమి అనేది మిగలదని, అసలు ఎవరూ మిగలరని, అంతా విధ్వంసమవుతుందని చాలా మంది ఇప్పుడు కూడా నమ్ముతారు. అయితే ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ఇలాంటి ప్రపంచ వినాశనానికి సంబంధించిన మరో విషయం కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే…

హిమాలయాల్లోని గుహల్లో ఉన్న 6 ఇంచుల శివలింగం రోజు రోజుకీ పెరుగుతోందట. అది అలా పెరిగి పెరిగి గుహ పై భాగం (సీలింగ్)ను తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు èఅవుతుందనే విషయం ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతోంది. హిమాలయాల్లోని గుహల్లో ఉన్న ఈ శివలింగాన్ని త్రేతా యుగంలో సూర్య వంశానికి చెందిన రితుపుర్ణ అనే రాజు గుర్తించాjడట. దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. నలుడనే రాజు తన భార్య దమయంతి చేతిలో ఓటమి పాలవగానే రితుపుర్ణ వద్దకు వచ్చి తనను తన భార్య చూడకుండా ఎక్కడైనా దాచి ఉంచాలని అడిగాడట. అప్పుడు రితుపుర్ణ నలుడ్ని హిమాలయాల్లో ఉన్న ఓ గుహలో దాచి పెడతాడు. అనంతరం తిరుగు ప్రయాణఃలో అతనికి ఓ లేడి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాన్ని తరుముకుంటూ వచ్చిన రితుపుర్ణ అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు. ఆ సమయంలో తాను ఒక కల కంటాడు. ఆ కలలో తనను చంపవద్దని వేడుకుంటున్న ఓ లేడిని అతను చూస్తాడు. వెంటనే కల మాయమై అతనికి మెళకువ వస్తుంది. అనంతరం ఆ లేడిని వెతుక్కుంటూ అతను పక్కనే ఉన్న మరో గుహ వద్దకు వస్తాడు. ఆ సమయంలో ఆ గుహను కాపలా కాస్తూ ఓ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు. అతని అనుమతితో గుహలోకి వెళ్లిన రితుపుర్ణకు పెద్ద ఆకారంతో ఉన్న ఓ శేష నాగు కనిపిస్తుంది. ఆ పాము అతన్ని గుహలోకి తీసుకెళ్లి అంతా చూపిస్తుంది. అక్కడే రితుపుర్ణ రాజు దేవుళ్లు, దేవతలదరినీ చూస్తాడు. వారిలో శివుడు కూడా అతనికి కనిపిస్తాడు. ఆ క్రమంలో రితుపుర్ణ ఆ 6 ఇంచుల శివలింగాన్ని చూసి దర్శించుకుంటాడు. అనంతరం ఆ గుహ కొన్ని యుగాల మూసి వేయబడిందట. దీన్ని గురించి స్కంద పురాణంలో కూడా వివరించబడి ఉన్నట్టు పండితులు చెబుతారు. కాగా ఆ గుహ మళ్లీ కలియుగంలోనే గుర్తించబడుతుందని అందులో ఉందట. అందుకు అనుగుణంగానే కలియుగంలో శంకరాచార్యుడు ఆ గుహను గుర్తించాడట. దీంతో అప్పటి నుంచి ఆ గుహలో ఉన్న శివలింగానికి నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయట.

అయితే అన్ని గుహల్లా ఆ గుహ ఉండదు. దాంట్లోకి వెళ్లాలంటే పై నుంచి కిందకి దాదాపు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. అలా దిగే క్రమంలో వచ్చే రంధ్రం చాలా చిన్నదిగా, ఇరుకుగా ఉంటుంది. గుహ మొత్తం 160 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో మళ్లీ అనేక గుహలు ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. కొన్నింటిలో నీటి ప్రవాహం ఉంటుంది. చిట్ట చివరికి ఉండే గుహను పాతాళ భువనేశ్వర్ గుహ అంటారు. కాగా ద్వాపర యుగంలో పాండవులు ఓ సందర్భంలో ఈ గుహను గుర్తించారని, అందులో కొంత కాలం నివసించారని కూడా కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది.

హిమాలయాల్లోని ఆ గుహలో ఉన్న 6 ఇంచుల శివలింగం ఏటా పెరిగిపోతోందట. ఈ క్రమంలో అది గుహ పైభాగాన్ని తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందని, అప్పుడు అంత సర్వ నాశనమవుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. సృష్టి నాశనం అనంతరం మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుందని కూడా చెబుతున్నారు. అప్పుడు మళ్లీ సృష్టి క్రమం మొదలవుతుందట. కొత్త ప్రపంచం సృష్టించబడుతుందట.

కొంతమందైతే ఈ గుహ భూమి ప్రారంభం నుంచి ఉందని చెబుతుండడం విశేషం. ఈ గుహ చుట్టూ ఉన్న మరికొన్ని గుహల్లో అత్యంత పురాతనమైన మహాకాళి ఆలయం, చాముండేశ్వరి ఆలయాలు ఉన్నాయని తెలిసింది. 1191 వ సంవత్సరం నుంచి ఈ గుహలో ఉన్న శివలింగానికి పూజలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. గుహలో ఉన్న రాళ్లు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలను పోలి ఉంటాయట. ఈ గుహను చేరుకోవాలంటే అర కిలోమీటర్ ముందే వాహనంలో ఆగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కాలి నడకనే గుహ ముఖ ద్వారంకు చేరాలి. అనంతరం ద్వారం నుంచి కిందకి దిగి శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అలా దిగే క్రమంలో కలిగే అనుభూతి వర్ణించరానిదని, గుహ లోపలికి పూర్తిగా చేరుకున్నాక ఆ అనుభూతి ఇంకా ఎక్కువ అవుతుందని పలువురు చెబుతున్నారు.

లయకారుని ఆలయాలే పంచారామాలు

లయకారుని ఆలయాలే పంచారామాలు
                       
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని ​ అంటారు.
1.దాక్షారామము - పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.
2.అమరారామము - పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరములో ఉంది..ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. అమరేశ్వరుడైన ఇంద్రుడు దీన్ని ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.

3.క్షీరారామము - క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడ శివునిశ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో కట్టబడింది.

4.సోమారామము - పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో ఉంది. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడని అందుకే సోమారామము అని పేరు వచ్చిందని చెబుతారు.

5.కుమార భీమారామము - కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో ఉంది.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముడే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడింది.

విజయాలను అందించే విజయదశమి

విజయాలను అందించే విజయదశమి

రాముడు... రావణుడి పీడను వదిలించిన రోజు...
దుర్గాదేవి... మహిషాసురుణ్ని తుదముట్టించిన రోజు...
మంచిపై చెడు గెలిచిన రోజు... అదే విజయదశమి.

ముల్లోకాలు ఆనందంతో పండుగ చేసుకునే రోజుగా దసరాను పేర్కొంటారు. దుష్టపీడ వదిలి... భూమిపై ధర్మస్థాపన జరిగిన రోజుగా చెబుతారు. అందుకే దసరా మనదేశమంతటా ప్రత్యేక పండుగ. ఒక్కోచోట ఒక్కోలా పిలుచుకున్నా... ఆ పేర్ల వెనుక అర్థం ఒక్కటే.

ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధనవమి వరకు తొమ్మిదిరోజుల పాటూ దేవీ నవరాత్రులుగా, పదో రోజును విజయదశమిగా జరుపుతారు. ఆ తొమ్మిది రోజులు శక్తి మాతని వివిధ రూపాలలో అలంకరించి కొలుస్తారు. కొన్ని చోట్ల నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీ దేవికి, తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి, చివర మూడురోజులు సరస్వతీ దేవికి పూజలు చేస్తారు.

మహిషాసుర మర్థినిగా అవతారం... వర గర్వితుడైన మహిషుడనే అసురుడు దేవతలను ఓడించి ఇంద్రపదవి చేపడతాడు. ముల్లోకాలను బాధిస్తుంటాడు. దేవతలంతా త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు. వారి ముగ్గురి క్రోధాగ్నిలోంచి ఒక తేజము బయటికి వస్తుంది. ఆ తేజము స్త్రీ రూపాన్ని ధరిస్తుంది. మంగళమూర్తిగా అవతరించి ఆ శక్తిస్వరూపిణి 18 బాహువులను కలిగి ఉంటుంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్టువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని... ఇలా ఒక్కోదేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇస్తారు. సింహాన్ని వాహనంగా చేసుకుని ఆ శక్తి స్వరూపిణి మహిషాసురుణిపై యుద్ధానికి వెళుతుంది. అతని సైన్యాన్ని చీల్చి చెండాడి, మహిషుణ్ని అంతమొందిస్తుంది. ఆ రోజు భూలోకంతో పాటూ ముల్లోకాలకు మహిషుడి పీడ విరగడౌతుంది. దేశంలో చాలా చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజయదశమిని చేసుకుంటారు. కొన్ని చోట్ల రామ్ లీల పేరుతో దసరాను జరునుకుంటారు. అందుకు కారణం త్రేతాయుగంలో రాముడు, రావుణున్ని ఇదేరోజు అంతమొందించాడు.

మైసూరు మహా దసరా... దేశం మొత్తంమ్మీద మైసూరులో అంగరంగవైభవంగా దసరాను నిర్వహిస్తారు. మైసూరు మహారాజుల కులదైవం చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగిస్తారు. మైసూర్ ప్యాలెస్ ను అందంగా అలంకరిస్తారు. ఆ భవనం చూడటానికే పర్యాటకులెంతో మంది మైసూరుకు దసరా నాడు వస్తారు.

ఏ శివలింగాన్ని పూజిస్తే ఎక్కువ ఫలితం?

ఏ శివలింగాన్ని పూజిస్తే ఎక్కువ ఫలితం?

శివరాత్రి
శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది. శివలింగాన్ని వజ్రం నుంచి మట్టి వరకు అనేక అనేక పదార్థాలతో తయారుచేసుకుని పూజించవచ్చు. స్టీలు,ఇనుముతో మాత్రం చేయకూడదని పండితులు చెబుతారు. లింగం చేసిన పదార్థాన్ని బట్టి వచ్చే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.

* వజ్రంతో చేసిన శివలింగానికి పూజ చేస్తే ఆయువు వృద్ధి చెందుతుంది.

* ముత్యంతో చేసిన లింగాన్ని సేవిస్తే రోగాలు నాశనం అవుతాయి.
* పుష్యరాగంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే కీర్థి లభిస్తుంది.
* నీలంరాయితో చేసిన లింగాన్ని సేవిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
* మరకతంతో చేసిన లింగాన్ని పూజించడం వల్ల సుఖమైన జీవితం లభిస్తుంది.
* స్ఫటికంతో చేసిన లింగార్చన అన్ని కోరికలను తీరుస్తుంది.
* స్త్రీలు గంధంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే నిండు నూరేళ్ల సౌభాగ్యం లభిస్తుంది.
* ఇత్తడితో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల తేజస్సు దక్కుతుంది.
* ధాన్యపు పిండితో చేసిన లింగాన్ని సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు.

శివుడంటే అసలు ఎవరు?

శివుడంటే అసలు ఎవరు?

శివుడంటే అసలు ఎవరు? క్యాలెండర్లో బూరె బుగ్గలతో, నీలవర్ణునిగా కనిపించే వ్యక్తే శివుడా? మరెవరన్నానా? ఆయన దేవుడా లేక ఓ కల్పనా? శివ అంటే అర్థం ఏమిటి? "శివ" అనే పదానికి భాషాపరంగా"ఏది లేదో అది" అని అర్ధం. ఈ సృష్టి మూలం, ఈ విశ్వ మౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే. ఈ నక్షత్రమండలాలు కేవలం దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యమే, దీనినే శివ అంటారు. అంటే అదే గర్భం, ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దానిలోనే లయమై పోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి. ఇందువల్లే శివుణ్ణి అస్తిత్వంఉన్నవానిగా కాక అస్తిత్వంలేనివానిగా వర్ణిస్తారు. శివుణ్ణి వెలుగుగా కాకుండా చీకటిగా వర్ణిస్తారు.

"శివ" అంటే ఆదియోగి, అని కూడా సూచిస్తుంది. యోగ అంటే తల్లక్రిందులుగా నుంచోటమో లేక శ్వాసను బిగపట్టి ఉంచటమో కాదు. ఈ సృష్టి ఎలా జరిగిందనే దాని ప్రాధమిక స్వభావం తెలుసుకోవటానికి, దాన్ని అత్యున్నత స్థాయికి ఎలా తీసుకువెళ్ళవచ్చో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానమే యోగ. దీనికి ఆద్యుడు శివుడు. ఆది యోగ గురువు.  ప్రాచీన కాలంలో దేవాలయాలు కేవలం శివుడికి మాత్రమే కట్టేవారు, వేరేవరికీ కాదు. దాదాపు గత1000 సంవత్సరాలలోనే మిగతా ఆలయాలు వచ్చాయి. "శివ" అనే పదానికి "ఏది కాదో" అది అని అర్ధం. అంటే ఆలయాలు "ఏది కాదో" దానికోసం కట్టేవారు. చాలా వాటిలో వాటికి ఏ రూపం ఉండదు. ఒక సూచనా రూపం ఉంటుంది, సాధారణంగా అది ఒక లింగం అయ్యుంటుంది.

సుబ్రహ్మణ్యేశ్వరుని శౌర్యానికి ప్రతీకే ‘శూర సంహారం’.

సుబ్రహ్మణ్యేశ్వరుని శౌర్యానికి ప్రతీకే ‘శూర సంహారం’.
గత రెండు రోజులుగా తమిళనాడులోని మధురై ప్రాంతమంతా వేలాది భక్తులతో కిటకిటలాడుతోంది. 'ఖాండ షష్టి'పర్వదినంలో భాగమైన 'శూర సంహారం'అనే వేడుకను చూడడం కోసం అంతమంది భక్తులు తరలివస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మీకో విషయం తెలుసా? శూరసంహారమనే వేడుక వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వకాలంలో విక్రమమహేంద్రపురి అనే నగరాన్ని శూరపద్ముడనే రాక్షసుడు పరిపాలించేవాడట. సజ్జనులను, బ్రాహ్మణులను అనేక కష్టాలకు గురిచేసే ఆ అసురరాజును సంహరించేందుకు సాక్షాత్తూ ఆ కార్తికేయుడే సిద్ధమయ్యాడు. తన వేలాయుధంతో భీకర పోరుకి సన్నద్ధమయ్యాడు. ఆ పోరాటంలో ఆఖరికి శివపుత్రుడినే విజయం వరించింది. ఇక ప్రాణాలు పోతాయన్న ఆ సందర్భంలో శూరపద్ముడు సుబ్రహ్మణ్యుడి పాదాల చెంత వాలిపోతూ.. తన జన్మ చరితార్థమయ్యేలా చూడమని కోరాడట. అప్పుడు నెమలిగా మారి తన వాహనంగా ఎల్లకాలం సేవలందించమని చెబుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ విధంగా ఓ రాక్షసరాజు సాక్షాత్తు ఆ మురుగన్‌కు వాహనంగా మారిన రోజునే శూర సంహారంగా ఇప్పటికీ జరుపుకుంటున్నారు ప్రజలు. 'ఖాండ షష్టి' పండగలో భాగమైన ఈ వేడుకను మధురైతో పాటు పళని, తిరుపాంకుందరం, తిరుచెండూర్ ప్రాంతాల్లోని మురుగన్ దేవాలయాల్లో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. తిరుపాంకుందరం‌లో బంగారు నెమలి మీద ఆసీనుడైన సుబ్రహ్మణ్యస్వామిను వూరేగిస్తూ చేసే శూర సంహార వేడుక కన్నులపండువగా సాగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేస్తారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పర్వదిన ముగింపు వేడుకలు తిరుచెండూర్‌లో చాలా ఘనంగా జరుగుతాయి.

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ??

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ??


ద్వాదశ జ్యోతిర్లింగాలను సాక్షాత్తు శివజ్యోతి ప్రతిరూపాలుగా మహా మహిమాన్వితాలుగా హైందవులు విశ్వసిస్తుంటారు. అయితే, అసలు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో పలువురికి తెలియదు.

గుజరాత్‌లోని అరేబియా సముద్రతీరంలో సోమనాథ క్షేత్రం ఉంది. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాతీరంలో శ్రీశైలం మల్లికార్జునుడున్నాడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు కొలువయ్యాడు.ఈ ప్రాంతం మధ్యప్రదేశ్‌కు వాయవ్యంగా దాదాపు రాజస్థాన్‌కు అనుకుని ఉంటుంది. నర్మదాతీరంలో ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 77 కిలోమీటర్ల దూరం.

కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్‌లోని బదిరీనాథ్ సమీపంలో వెలిశాడు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో వెలసిన జ్యోతిర్లింగం భీమశంకరుడు. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరుడు కొలువయ్యాడు. కాశీలోని జ్యోతిర్లింగం విశ్వనాథుడు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ ప్రాంతంలో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారక సమీపంలో ఉంది. తమిళనాడులోని రామేశ్వరంలో రామేశ్వరుడు ఉన్నాడు. మహారాష్ట్రలోని దౌలతాబాద్ దగ్గర ఘశ్మేశ్వరుడి పేరుతో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు.

శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం ఇదే!




శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం ఇదే!



చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో సమంగా ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతుల మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటి? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం.

సృష్టారంభ వేళలో బ్రహ్మ ద్వారా రచింపబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆకాశవాణి వినవచ్చింది. బ్రహ్మా! మైథునీ సృష్టి చేయి. ఆకాశవాణిని ఆలకించి బ్రహ్మదేవుడు మైథునీ సృష్టిని చేయ సంకల్పించాడు.

కానీ తత్సమయం వరకు నారీ జనోత్పత్తి కాకపోవడం వల్ల అతడు తన నిశ్చయంలో సఫలుడు కాలేకపోయాడు. శివపరమేశ్వరుని కృపారహితంగా మైథునీ సృష్టి కాజాలదు. అందులకే అతడు శివదేవుని ప్రసన్నుని చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు. చిరకాల పర్యంతం బ్రహ్మదేవుడు తన హృదయంలో ప్రేమపూర్వకంగా శివమహేశ్వర ధ్యానం చేస్తూండిపోయాడు. అతని తీవ్ర తపస్సుకు ప్రసన్నుడైన ఉమామహేశ్వర భగవానుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. దేవాదిదేవుడైన శివభగవానుని ఆ దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ అభిభూతుడై దండవత్ భూమిపై వరుండి అతని అలౌకిక విగ్రహానికి ప్రణమిల్లాడు.

శివే! సృష్ట్యారంభంలో నీనాథుడూ దేవాది దేవుడు అయిన శంభు భగవానుడు నన్ను సృజించాడు. భగవతీ! ఆయన ఆదేశానుసారమే దేవతాది సమస్త ప్రజల మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తరువాత కూడా ఆ సృష్టిని వర్థిల్లజేయడంలో నేను అసఫలుడనయ్యాను. కనుక ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తిని చేసి సృష్టిని వర్ధిల్లజేయదలచా. కానీ ఇంత వరకూ నారీకులం ప్రకటింపబడలేదు. నారీ కులాన్ని సృష్టించడం నాకు శక్తికి అతీతంగా ఉంది. దేవీ! నీవు సంపూర్ణ సృష్టికీ, శక్తులకూ ఉద్గమస్థానానివి.

హే మాతేశ్వరీ! నీవు నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదింతువు గాక! నేను మరో ప్రార్థన చేస్తున్నా. చరాచర సృష్టి వర్థనార్థం నా దక్షపుత్రునికి పుత్రీరూపంలో అవతరించ నీవు దయ చూపెదవు గాక! అని బ్రహ్మ అర్ధించాడు. బ్రహ్మ ప్రార్థననాలకించి శివాని తథాస్తు అంటూ అతనికి నారీ కులాన్ని సృష్టించగలుగునట్టి శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకై ఆమె తన భృకుటీ మధ్యభాగం నుండి తనతో సమానమైన కాంతిమతి అయిన ఓ శక్తిని ప్రకటింపజేసింది. దానిని తిలకించి దేవదేవేశ్వరుడైన శివుడు చిరునవ్వు నవ్వుతూ దేవీ! బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు.

నీవతనిపై ప్రసన్నరాలవై అతని మనోభీష్టాన్ని నెరవేర్చుము అన్నాడు. పరమేశ్వరాజ్ఞను శిరోధార్యం చేసి ఆ శక్తి బ్రహ్మ ప్రార్థనానుసారం దక్షపుత్రి అయినది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్థానమై పోయాడు. నాటి నుండియే ఈ లోకంలో మైథానీ సృష్టి కొనసాగింది. సఫల మనోరథుడైన బ్రహ్మ శివపరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరిల్లజేశాడు.

అలా శివ- శక్తులు పరస్పరాభిన్నులై సృష్టికి ఆదికారణులైనవారు. పుష్పంలో గంధమూ, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో ప్రభనిత్యులై, స్వభావ సిద్ధులై ఉన్నట్లే శివునిలో శక్తి కూడా స్వభావ సిద్ధయై రాజిల్లుతూ ఉంటుంది. శివునిలో ఇ కారమే శక్తి అయి ఉన్నది. శివుడు కూటస్థతత్వం కాగా శక్తి పరిణామ తత్త్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు, ఆత్మకాగా శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తి సత్తాగా ఉంటుంది. అర్థనారీశ్వర శివుని రహస్యమిదే అని చెబుతారు.

అర్థనారీశ్వర తత్వానకిి అర్థం

ప్రకృతి  =  అమ్మ
పురుషుడు = ఈశుడు

శ్వాసలో పూరకం = ఈశుడు = అంతర్ముకవృత్తి
శ్వాసలో రేచకం = పార్వతి    = బహిర్ముకవత్తి.

హంస ..... హ కార శివరూపాయ
                 స  కార శక్తిరుచ్యతే.

    !!శివశక్తుల సమ్మేళనమే నటరాజు ఆడే ఆట!!

Friday, October 7, 2016

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం...

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం...
పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!

తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.

గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.

దేవీ రూపాలు... ప్రత్యేక నైవేద్యాలు!

దేవీ రూపాలు... ప్రత్యేక నైవేద్యాలు!
దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఆమె నామాలు, అవతారాలు, రూపాలు అనేకం. ఏ రూపంలో కొలిచినా ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే పూజకి మరింత ఫలితం. అమ్మవారు ఏ రూపంలో ఏ నైవేద్యాన్ని ఇష్టపడతారో తెలుసుకుందాం.

బాలాత్రిపుర సుందరీదేవి - పొంగలి
గాయత్రీ మాత - పులిహోర
అన్నపూర్ణాదేవి - కొబ్బరన్నం
లలితాత్రిపురసుందరి - గారెలు
సరస్వతీదేవి - పెరుగన్నం
మహాలక్ష్మిదేవి - రవకేసరి
దుర్గాదేవి - కదంబం - అన్నికూరలు అన్నం కలిపి వండే వంటకం
మహిషాషురమర్ధిని - బెల్లంతో చేసిన వంటకం
రాజరాజేశ్వరి అమ్మవారు - పరమాన్నం!!

శరన్నవరాత్రులు ఎందుకంటే

శరన్నవరాత్రులు ఎందుకంటే...

దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం సంప్రదాయం. అమ్మవారి వివిధ రూపాలు...

1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దశమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదశమి

దసరా నవరాత్రులు... నవ వర్ణాలు!

దసరా నవరాత్రులు... నవ వర్ణాలు!
                                                                                          
దసరా నవరాత్రుల్లో... దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం... 

మొదటి రోజు: నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

రెండో రోజు : బ్రహ్మచారిణిగా శక్తిని కొలుస్తాం. కనుక ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి.

మూడో రోజు: అమ్మవారి అవతారం ఈ రోజు చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి.

నాలుగో రోజు : దుర్గమ్మను కూష్మాండ అవతారంగా కొలుస్తాం. నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది.

అయిదో రోజు: స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించి పూజచేయాలి.

ఆరో రోజు: కాత్యాయనీ మాతగా అమ్మవారు కొలువుదీరే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

ఏడో రోజు: కాళరాత్రి అవతారంతో అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుంది. ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి.

ఎనిమిదో రోజు: మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి.

తొమ్మిదో రోజు: చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందు కుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం!!

మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?

మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?
శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా  జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు.
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి. వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు, మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది.  ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి. జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని
తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే  మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.

మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?

కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?
నాలుగు యుగాల్లో కలియుగంలో పాపాలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంటుంది. కలిపురుషుని ప్రభావంతో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు సంభవిస్తుంటాయి. మానవులు ధర్మబాటలో నడవకుండా అధర్మప్రచారానికి ప్రభావితమవుతారు. కలియుగంలో మనకు అండగా వుండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడుకొండలపై శ్రీ వేంకటేశ్వరస్వామిగా అవతరించారు. స్వామిని స్మరిస్తేనే పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా వుంటూ భక్తుల పాపాలను తొలగిస్తున్న స్వామిని ‘కలౌ వేంకటనాయకా’ అని పిలుస్తారు.
‘సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే ’ భవిష్యత్‌పురాణంలో ఇలా పేర్కొన్నారు. అన్ని పాపాలను ‘వేం’ అని అంటారు. కట అంటే తొలగించడం. వేంకట అంటే మన పాపాలను దహించేవాడు. అందుకనే ఆ నారాయణుడిని కలౌ వేంకటనాయకా అని భక్తితో కొలుస్తాము. ‘‘ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే, రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌’’ఈ మంగళశాసనం వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమండలంలోని తిరునగరిలోని పుష్కరిణిలో విహరించడానికి విచ్చేశారని వెల్లడిస్తోంది. తన భక్తులను స్వయంగా పరిరక్షించేందుకే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఆదివ‌రాహ‌ స్వామి వద్ద అనుమతి పొంది నివాసముంటున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వెలిశారు కనుకనే ఈ తిరుక్షేత్రం లక్షలాది భక్తుల రాకతో దివ్యారామంగా విరాజిల్లుతోంది.

అష్టమహాదానాలని వేటిని అంటారు?

అష్టమహాదానాలని వేటిని అంటారు?

సనాతన సంప్రదాయంలో అష్టమహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు వున్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటిని దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి.
ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. భూమిని దానం చేయడం ద్వారా సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భయముండదు. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.
ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి మనకున్నంతలో ఇవ్వడమే అని పరమార్థం.

భూకైలాసం..

భూకైలాసం..
పరమేశ్వరుడు స్వయంభువుగా భువిపై వెలసిన క్షేత్రమే చెన్నై నగరంలోని మైలాపూర్‌లోని అరుల్‌మిగు కపాలీ
శ్వరస్వామి ఆలయం. లయకారకుడైన శివుడు స్వయంగా భువిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. సాక్షాత్తు ఆ జగన్మాత పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన పవిత్రపుణ్యక్షేత్రమది. అరుల్‌మిగు కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. అందుకనే మైలైయే కైలై- కైలేయే మైలై అంటారు. దీనర్థం మైలాపూరే కైలాసం, కైలాసమే మైలాపూర్‌ అని అర్థం. అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది. అందుకనే మయిల్‌ అంటే నెమలి పేరుతో మైలాపూర్‌గా ఏర్పడింది.
బ్రహ్మ శాప విముక్తి.. కైలాసంలో శివున్ని దర్శించిన అనంతరం సృష్టికర్తయైన బ్రహ్మ గర్వం ప్రదర్శించాడు. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు అతని తలల్లో ఒకదానిని ఖండించి ఆ తలను ఒక చేతిలో పట్టుకున్నారు. కపాలాన్ని ధరించిన వాడు కనుక కపాలీశ్వరుడు అని అంటారు. బ్రహ్మ తన పాప నివారణ కోసం మైలాపూర్‌ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేయడంతో ఆయన పాపం పరిహారమయింది.

అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం.. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథనం ప్రాచుర్యంలో వుంది. నమశ్శివాయ అన్న పదానికి అర్థాన్ని శంభునాథుడు పార్వతీ దేవికి వివరిస్తుండగా ఆమె ఒక నెమలి వైపు దృష్టి సారించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన నెమలిగా మారిపొమ్మని శాపం ఇస్తాడు. దీంతో ఆమె శాప విముక్తి కోసం ప్రార్థించగా భూలోకంలో తన కోసం తపస్సు చేస్తే విముక్తి కలుగుతుందని చెబుతాడు. భూలోకంపై అడుగుపెట్టిన పార్వతీ దేవి ఒక చెట్టుకింద నెమలిరూపంలో స్వామివారి కోసం తపస్సు చసింది. ఆమె తపస్సుకు ప్రత్యక్షమైన లయకారకుడు శాపవిముక్తి చేయడంతో పాటు కర్పగవల్లిగా దీవించాడు. దీంతో ఆ ఆదిదంపతులు ఇక్కడే నివాసముంటూ భక్తులకు అభయమిస్తున్నారు.
మురుగన్‌కు వేలాయుధం.. రాక్షసుడు సురపన్మను సంహరించేందుకు సుబ్రమణ్యస్వామి ఈ ఆలయంలోనే తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన ఆదిదంపతులు తమ కుమారునికి వేలాయుధం ఆయుధాన్ని ఇక్కడే ఇచ్చినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. రాక్షస సంహారం అనంతరం శరవణుడు సింగారవేల్‌గా తిరిగొచ్చాడు. దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రమణ్యస్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు. దేవలోకంలో వుండే ఐరావతం దేవసేనతో బాటే వచ్చేస్తుంది. అందుకనే వల్లీ, దేవసేన సమేతంగా మురుగన్‌ ఐరావతంపై దర్శనమిస్తుంటారు. ఇది అరుదైన దర్శనం కావడం విశేషం.
తిరుజ్ఞాన సంబంధర్‌.. నయనార్ల పరంపరలో తిరుజ్ఞాన సంబంధర్‌ మహాభక్తుడు. ఆయన తొలి కావ్యాన్ని స్వామి సన్నిధిలోనే రాయడం విశేషం. పరమేశ్వరుడు భక్తులకు పెన్నిధి అనే అంశాన్ని ఈ కథ నిరూపిస్తుంది. శివనేశ్వర్‌ అనే భక్తుని కుమార్తె పూంపవై. ఆ బాలిక రోజు శివపూజలో తరించేది. ఒకరోజు పూలు కోస్తుండగా పాము కాటుతో మరణిస్తుంది. భగవంతుడినే నమ్ముకున్న శివనేశ్వర్‌ ఆమె అస్థికలను ఒక కుండలో వుంచుతాడు. ఒకనాడు సంబంధర్‌ అక్కడకు రాగా శివనేశ్వర్‌ తన దీనగాధను విన్నవించి ఆ కుండను ఆయన ముందువుంచుతారు. పరమభక్తుడైన సంబంధర్‌ కపాలీశ్వరుని ఆర్థ్రతతో ప్రార్థిస్తాడు. మట్టిట పున్నై అనే గానంలో పరమేశ్వరుని పండగలను వివరిస్తూ బాలిక శివుని పర్వదినాలను ఎలా వీక్షించకుండా వుండగలదు అని వేడుకుంటాడు. దీనదయాళుడైన ఆ శంభునాథుడు ఆ బాలికకు తిరిగి ప్రాణం పోస్తాడు. ఒక్కసారిగా కుండలు పగిలి అస్థికల నుంచి బాలిక బతికొస్తుంది. కృతజ్ఞతాభావంతో శివనేశ్వర్‌ సంబంధర్‌కు ఆమెను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అయితే తాను జీవితాన్ని తిరిగి ఇచ్చాను కాబట్టి తండ్రిలాంటి వాడినని సున్నితంగా తిరస్కరిస్తాడు. పూంపవై తన శేషజీవితాన్ని భగవంతుని సన్నిధానంలో గడిపి శివసాయుజ్యం పొందింది.
ఎలా చేరుకోవాలి..
*
చెన్నై దేశంలోని ప్రధాన నగరం
* అన్నిప్రాంతాలతో చెన్నైకు రవాణాసౌకర్యాలున్నాయి.
*
రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చెన్నై చేరుకోవచ్చు

కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!

కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!
‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’ ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓం (ఓంకారం) పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.
2. యమధర్మ రాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.
3. ఆత్మకు జననం, మరణం లేదు.
4. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక, చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక, చావుల చక్రంతో సంబంధం ఉండదు. అతను బ్రహ్మతో సమానం.
5. యమధర్మ రాజు చెప్పిన దాని ప్రకారం దేవున్ని నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.

ఆత్మల గురించిన ప్రస్తావన….

భగవద్గీత లో.
శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక “అహం బ్రహ్మస్మి” నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి.

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.

తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..? అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..?

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..?
        అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..?

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుకు అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది.అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం...
   
బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.
   
అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.

కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.
   
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.

బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.
   
పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.
 
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది.
   
బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది.
   
చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం.

బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది.
 
ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి.

అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి.

శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు..

భూమి-సూర్యుడి మధ్య దూరం హనుమాన్ చాలీసా లో ఎలా రాసారు?

భూమి-సూర్యుడి మధ్య దూరం 
హనుమాన్ చాలీసా లో ఎలా రాసారు?

15వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసా ను రచించాడు.
ఇందులో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది. 17వ శాతంబ్దంలో 1672 సంవత్సరంలో జీన్ రిచెర్ మరియు జియోవన్ని డోమేనికో కాస్సిని అనే వారు భూమి యొక్క వ్యాసార్థంను (రేడియస్) 22,000 సార్లు కలిపితే భూమి నుండి సూర్యుడి దూరం అంతా అని దృవీకరించారు. భూమి యొక్క వ్యాసార్థం 6,371 కీ. మీ. అంటే 2200 0 x 6371 = 140,162,000 కీ. మీ. (140 మిలియన్ కీ. మీ.) అని శాత్రవేత్తలు చెప్పారు. కానీ అది కేవలం అంచనా అని తేలిపోయింది.
ఇదే విషయాన్ని హనుమాన్ చాలీసా లో కేవలం మూడు ముక్కలలో మరింత స్పష్టంగా తెలియజేసారు. తులసీదాస్ హనుమాన్ చాలీసా లో రచించినట్టు..... యుగ సహస్ర యోజన పరభానూ, లీల్యోతాహి మధుర ఫలజానూ..... అనే దానిలో భూమి నుండి సూర్యుడి వరకు ఎంత దూరం ఉందో స్పష్టంగా ఉంది.

యుగ అంటే = 12000
సహస్ర అంటే = 1000
యోజన అంటే = 8
12000 x 1000 x 8 = 96,000,000 మైళ్ళు
1 మైలు = 1.6 కీ. మీ.
96,000,000 x 1.6 కీ. మీ. = 153,600,000 (15 కోట్ల 36 లక్షల కీ. మీ.)
ప్రస్తుతం భూమి నుండి సూర్యుడి వరకు ఉన్న దూరం = 149,600,000
శాస్త్రవేత్తల కన్నా రెండు శతాబ్దాల ముందే... 15వ శతాబ్దంలో తులసీదాస్ ఈ లెక్కను ఇంత దెగ్గరగా ఎలా చెప్పాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం... హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు, సూర్యుడిని పండు అనుకోని మింగేస్తాడు.... అప్పుడే భూమి నుండి సూర్యుని వరకు ఎంత దూరముందో తెలుసుకున్నారని అంటారు. హనుమాన్ చాలీసా లో రచించిన దూరంతో అమెరికా లోని నాసా సంస్థ వారు కూడా ఏకీభవించారు.

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది                                                                                           
ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.

వారణాసిలో నివసిస్తూవున్నసంత్ తులసీదాస్ :రామనామగాననిరతుడయి బ్రహ్మానందములో తేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు.

ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.

ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు.

శవాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది.

శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది..
గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది.

అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.

దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.

ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.

తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీ రామనామము ,మీరు చెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సింహద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ...... జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమి కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది..