విఘ్నాలను తొలగిస్తాడు కనుక విఘ్నేశ్వరుడు. సంకటాలను హరించే వాడు కనుక హేరంబుడు. సర్వలోక రక్షకుడు కనుక లంబోదరుడు. పూర్ణజ్ఞానాన్ని ప్రసాదించి, రక్షిస్తాడు కాబట్టి శూర్పకర్ణుడు. ఇలా ఎన్నో విశేషాలకు నిలయం గణనాధుడు.
దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని ముందుగా పూజించి తరువాతనే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తోంది. ప్రాచీనమైన దైవంగా విఘ్నేశ్వరుని భావించి ఆయనకు గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. రుగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలోముందుగా పూజింపదగినవాడని తెలియచేసింది. సృష్టి మొత్తాన్ని ముప్ఫై మూడు కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి.
అలాగే వేదాంగాలలో ఒకటైన ఛందో శాస్త్రంలోని మగణ, భగణ, జగణ, నగణ, సగణ, రగణ, తగణ, యగణములనే అష్ట గణములకు అధిష్ఠాన దేవత గణపతి. ఆ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు కూడా ప్రభువు. ఓంకారము అన్ని ఛందస్సులకు మొదటిదని 'ప్రణవశ్చందసామివ' అని కాళిదాసు చెప్పినట్లుగా ప్రణవనాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెప్పింది.
గణపతి సర్వవిద్యాధిదేవత. ప్రణవ స్వరూపుడై, శబ్దబ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు.
''జ్ఞానార్థవాచకోగశ్చ, ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్!!
'గ' అనే అక్షరం జ్ఞానార్థ వాచకమై, 'ణ' అనే అక్షరం నిర్వాణవాచకమై 'గణ' అనే శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. దీనిద్వారా వాగధిపతి గణపతియే అని శాస్త్రం చెబుతుంది. శ్రీ గణేశ అనే సంస్కృత పదమునకు ప్రారంభం అని అర్థము. అందుకే వినాయకుడు ఆదిదేవుడు అయ్యాడు. గణ్యంతే బుధ్యంతే తే గణాః అన్నట్లు సమస్త దృశ్యమాన పదార్థాలు, గణాలు అన్నింటికీ అధిష్ఠానదేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు.
సమస్త విఘ్నాలను రూపుమాపి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. గణనాథుడు ఓంకార స్వరూపుడని గణపత్యధ్వర శీర్షం వర్ణించింది. స్వయంభువు అయిన మూలవిరాట్టు ఉద్భవించిన తరువాత ఆయన నుంచే ముక్కోటి దేవతలూ ఆవిర్భవించారు. దేవతా గణములు ఉద్భవించి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆది పురుషుడుగా గణపతి పూజలందుకుంటున్నట్లు గణేశపురాణం తెలియజే స్తోంది. గణేశుడువిష్ణుస్వరూపుడని 'శుక్లాంబరధర విష్ణుం' అన్న శ్లోకం సూచిస్తుంది.
సర్వసిద్ధి ప్రదుడు, సర్వమంత్ర దేవతారూపి, విఘ్నహరుడు, ప్రణవ స్వరూపుడుఅయిన గణపతికి అనేక రూపాలున్నాయి. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంతో పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలి వాహనంతో మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై, సంపద బొజ్జతో ఉన్న గజాననుణ్ణిఆరాధిస్తున్నాం.
No comments:
Post a Comment