
నామ రూపాత్మకమైన జగత్తుకు స్వతంత్రమైన ఉనికి లేదు. మార్పు చెందే దేనికైనను మార్పు చెందని, స్థిరమైన, శాశ్వతమైన ఆధారము ఒకటి ఉండాలి.
నామ రూపాత్మకమైన జగత్తు, సృష్టికి పూర్వము బ్రహ్మము నందు అవ్యక్తముగా ఉన్నది. అది సృష్టిగా వ్యక్తమైనది. తిరిగి ప్రళయమందు తనకు ఆధారమైన బ్రహ్మ మందు తన సృష్టికి పూర్వ స్థితిని పొందుచున్నది.
బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది. సృష్టిగా ఉన్నప్పుడు ఉన్నది. సృష్టి లయమైన పిదప ఉన్నది. బ్రహ్మము సృష్టికి ఆధారముగా ఉన్నది. కనుక బ్రహ్మము సత్యము. సృష్టికి స్వతంత్రమైన ఉనికి లేదు. కుండ యొక్క ఉనికి మట్టికి వేరుగా లేనట్లే, సృష్టి యొక్క ఉనికి బ్రహ్మమునకు వేరుగా లేదు. స్వతంత్రమైన ఉనికి లేనిదానిని మిథ్య అంటారు. కనుక బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య.
#బ్రహ్మము + మాయ = ఈశ్వరుడు
బ్రహ్మము దేనికి (సృష్టికి) కారణము కాదు. కేవలము ఆధారము. బ్రహ్మము, మాయ శక్తిని కలపి ఈశ్వరుడు అంటారు.మాయా శభలిత బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ఈశ్వరునికి మాయ శక్తి స్వాధీనమై ఉంటుంది. ఆ మాయాశక్తి ద్వారా ఈశ్వరుడు ఈ సృష్టిని సృజించాడు.
సృష్టికి పూర్వము నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మము నందు, విత్తనమందు మహావృక్షము అవ్యక్తముగా ఉన్నట్లు, అవ్యక్తముగా ఉన్నది. బ్రహ్మమునందు అవ్యక్తముగా వేరుచేయుటకు వీలుకానిదిగా ఉన్న నామరూపాత్మకమైన జగత్తును మాయ అంటారు.
మరియొక కోణమున చూచిన అవ్యక్తముగా ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.
#జ్ఞానశక్తి - క్రియా శక్తి - ద్రవ్య శక్తి
అవ్యక్త స్థితియందు ఉన్న ఈ మూడు శక్తులే సత్వ, రజో, తమో గుణములు (మూడు గుణములు) గా వ్యక్త మవుచున్నవి.
అవ్యక్త స్థితియందు ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.
వ్యక్త స్థితి యందు , మూడు గుణములే మాయ. (మాయ త్రిగుణాత్మకము).
No comments:
Post a Comment