
స్త్రీలు చాలా మంది ఉపాసన పధ్ధతులు ఏమిటి? ఋతుకాలం వలన మాకు గల నిషిధ్ధాలు ఎందుకు? ఇలాంటివి తరచు అడుగుతూ ఉంటారు.
స్త్రీలకు ఉపాసన ,ఆర్గం అనాదిగా యున్నది. తపస్సు ఏ ఒక్కరి ఆచరణకే పరిమితం కాదు.గోధ అనే ఋషి (స్త్రీ) యఙ్ఞంలో పశు బలిని విరోధించినట్లు తెలుస్తున్నది.
భారతం లోని సంభవ పర్వం లో చక్కని మాటలున్నాయి. దుష్యంతుని దగ్గరకు శకుంతల భరతుని తీసుకుని వెళ్లినప్పుడు ఆకాశవాణి స్త్రీల విషయంలో కొన్ని మాటలు వినిపించింది:
శ్లో: స్త్రియ: పవిత్రమతులమేతద్ దుష్యంత ధర్మత:
మాసి మాసి రజో హ్యాసాం దుష్కృతాన్యపకర్షతి
స్త్రీలు అనుపమానముగా పవిత్రులు. ఇది ధరమత: చెప్పబడినది. ప్రత్యేక మాసంలో వీరికి ఋతుస్రావం ఏదైతే జరుగునో అది వీరి సమస్త దోషములను దూరం చేస్తుంది!
ఆత్మావై పుత్ర నామాసి- భార్య ద్వారా పుత్రుని పొందినపుడు పుత్రుడు తండ్రి యొక్క మరో రూపమే. తండ్రి మరల భార్య ద్వారా జన్మించు చున్నాడు. అందు చేత భార్య ఆ విషయంలో తల్లితో సమానమని శాస్త్రం. ఆమె ‘జాయ ‘ అనబడుతుంది.
శ్లో: భార్యో పతి: సంప్రవిశ్య స యస్మాజ్జాయతే పున:
జాయాయాస్తధ్ధి జాయాత్వం పౌరాణా: కవయో విదు:
ఋతు కాలం ప్రకృతి సహజమైన ఒక ప్రక్రియ. ఇది సంతాన ప్రాప్తికి ముడి పడిన విషయం. సామాన్యంగా ప్రకృతితో ఏకమయ్యి చేయు తపస్సుకు, ఇండ్లలో జరుపు పూజా విధానాలకు గల వ్యత్యాసం వలన ఇబ్బందులు ఉంటాయి. పూజా విధానాలు చాలా మటుకు శౌచం తోనే ముడి బడి ఉంటాయి. మల మూత్ర విసర్జన తరువాత విధానం ప్రకారం శుచిర్భూతులవటం కర్తవ్యం. కాకపోతే ఋతుస్రావం మీద నియంత్రణ ఉండదు కాబట్టి ఆ సమయంలో అవరోధం ఏర్పడును కాబట్టి పూజా విధానాలకు దూరంగా ఉంచటం జరిగింది. ఇది స్త్రీలను హేళన చేయుటకు కాదు. వారికి ఊరట కోసం, పూజలో స్వేఛగా పాల్గొనలేనందుకు ఒక ఏర్పాటు చేయటం.
స్త్రీలు సంధ్యావందనం చేయవచ్చా? అనునది పలువురు అడుగుతూ ఉంటారు.
సంధ్యోపాసన స్త్రీలు ఆచరించేవారు. రామాయణం లో సుందరకాండలో సీత సంధ్య వేళ సంధ్యావందనం చేసినట్లు తెలుస్తున్నది.
రామాయణం లోనే సీత ఒక విశేషమైన మాట చెప్పి యున్నది.
పతి సేవ తప్ప స్త్రీలకు ప్రత్యేకంగా శాస్త్రాలు ఏ ఉపాసనా పధ్ధతి చెప్పలేదన్నది. లేదని నిర్ధారించింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
స్త్రీకి ఉన్న గొప్ప అవకాశం అది. పతి ద్వారా సూటిగా ఆమెకు మోక్షం-షార్ట్ కట్! పురుషునికి రక రకాల కర్మలను ఆచరించవలసి యున్నది.ఆయన చేస్తున్నవన్నీ భార్యకు చెందేవే! ఆయనను విస్మరించి ఏదో వ్రతాలు చేపట్టటమంత మూర్ఖత్వం మరొకటి లేదు. అలా చేయు వారు అసలు ఉపాసన అనే మాటకు అర్థం మరచి లోఉకికమైన ఖ్యాతి కోసం తపిస్తున్నారని అర్థం.
జాగ్రత్తగా ఆలోచిస్తే స్త్రీకి వివాహం తోనే మోక్షం! అక్కడితోనే సరి! భగవంతుని చింతన ఎవరైనా చేసుకొన వచ్చును. అందు చేత నిజమైన పతివ్రత పతి కంటే శక్తి కలది! నిజమైన పతివ్రత ధర్మాన్ని కూడా ఎదిరించి నిలబడగలదని పురాణాలు చెబుతున్నాయి.ఇది సామాన్యమైన విషయం కాదు.
గాయత్రీ ఉపాసన సంగతి ఏమిటి? అని అనుకున్నప్పుడు ఒక విషయం మనవి చేయాలి. బ్రహ్మోపదేశం అనేది సంధ్యావందనం, సూర్యోపాసన వైపు తీసుకుని వెళ్లునది. సూర్యుడు కర్మలను చేయమని ప్రేరేపించు వాడని శృతులు చెబుతున్నాయి. అట్టి కర్మలను ఉపాసించి పురుషార్థం సాధించుట పురుషుని కర్తవ్యం కాబట్టి మార్గం ఆ దిశగా నిర్మించబడినది. భార్య ఆతనిని అనుసరించునపుడు ప్రత్యేకంగా బ్రహ్మోపదేశం పొందవలసిన అవసరం ఏముంటుంది?
అదలా ఉంచండి.
భారతీయులు సూర్యోపాసకులు. సావిత్రిని గాయత్రీ మంత్ర జపం ద్వారా ఉపాసించు సర్వులూ శక్తి ఉపసకులే. గాయత్రీ జపం చేయు వారందరూ ఆ శక్తి స్వరూపాన్నే ఆరాధిస్తున్నారు. గతంలో చెప్పినట్లు భర్తలో భార్య శక్తి స్వరూపిణిగా కలసి యున్నట్లు త్రిమూర్తులు వారిలో వారి భార్యలను ధరించటం మనం చూశాము!
స్త్రీలు లలితా సహస్రనామం లో ‘ గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశా…’
అనే మాటను ధ్యానిస్తే చాలు.
ఇక్కడ అందుచేత ఒక రహస్యం కనిపిస్తుంది. పురుషుడు ఒక యోగ్యురాలైన కన్యతో
ప్రకృతిలోని శక్తిని పొంది వివాహ వ్యవస్థలోకి వెళ్లాలన్నా ప్రకృతి సిధ్ధమైన సూర్యోపాసన, గాయత్రీ మహా మంత్ర జపం, నిష్ఠతో పాటించవలసిన బ్రహ్మచర్యం అనివార్యమని మనకు తెలుస్తున్నది. అదే విధంగా స్త్రీ ఎందుకు సహజమైన శక్తి స్వరూపిణి అన్నది కూడా అర్థమవుతుంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం తత్ సత్!
No comments:
Post a Comment