సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, July 19, 2016

గురు(వ్యాస)పూర్ణిమ

గురు(వ్యాస)పూర్ణిమ

వ్యా సుడి విజ్ఞానం ఎవరినైనా సంభ్రమాశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. అవి విడదీయడానికి సాధ్యం కానట్లుగా కలిసిపోయాయి. వ్యాసుడు ఆ వేదాలను విభజించి, తిరిగి మనకు ప్రసాదించాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త.
భారత ఇతిహాసాన్ని రచించిన వ్యాసుడు, మన ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన పద్దెనిమిది పురాణాలను వెలువరించాడు. ఇవన్నీ చేయడం మానవమాత్రుడికి సాధ్యమా? అందుకే భక్తులు ఆయనను మహావిష్ణువుగా భావిస్తారు.
జగద్గురువుల్లో ప్రథముడు వ్యాసుడే. వ్యాస పూజ అంటే వేద పూజ, ఈశ్వర పూజ! దైవానుగ్రహం కావాలంటే, గురువు ఆశీస్సు లభించాలి. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి, వెలుగు చూపినవాడే గురువు.

ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించిన జ్ఞాన సంపన్నులను గురువులుగా పరిగణించి, శిష్యులు వారికి పూజ చేస్తారు. వ్యాస పూర్ణిమనాడు మనం పూజించే 'వ్యాసుడు' ఫలానా వ్యక్తి అని ఒక్కర్ని గురించి చెప్పే 'పదం' కాదు. అది 'పదవి'! అది సకల కళానిధి, మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడి పరంపరలో వచ్చిన, వస్తున్న, రానున్న గురువులందరికీ చెందుతుంది. అందువల్ల వ్యాసపూర్ణిమనాడు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు. కలియుగంలో ఈ పండుగను పాటించే సంప్రదాయాన్ని ఆ55దిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.
ఒకప్పుడు యతీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు పాటించిన ఈ పర్వదినం, ఇప్పుడు జన సామాన్యంలోకి వచ్చింది. నేపాలులో ఇది ముఖ్యమైన పండుగ. మన దేశంలోనూ అనేక విద్యాలయాల్లో గురుపూజ, వ్యాసపూజ జరుగుతాయి. శంకర పీఠాల్లో గురుపూర్ణిమ భక్తి ప్రపత్తులతో జరుగుతుంది.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని కలియుగంలో జీవిస్తున్నాం. ప్రతి మహాయుగంలోనూ మహావిష్ణువు 'వ్యాసుడు'గా అవతరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మొదటి వ్యాసుడు స్వాయంభువుడు; 27వ వ్యాసుడు జాతూకర్ణుడు. ఇప్పటి వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు.
మానవజాతికి మహోపదేశం చేసేవి వేదాలు. సోమరితనం పాపమని, కృషిచేసేవాడికే దైవం తోడ్పడతాడని, శ్రమలోనే సంపద ఉన్నదని, ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్నీ స్నేహబుద్ధితో చూడాలని... వేదం పలుకుతున్నది. ధార్మిక సేవకు వేదం మూలమని మనుస్మృతి పేర్కొంది. ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికీ మనకు లభిస్తుండటానికి కారకుడు వ్యాసుడు!
మన పవిత్ర పారాయణ గ్రంథం భగవద్గీత. తిలక్‌, గాంధీలను కర్తవ్య దీక్షాదక్షుల్ని చేసిన భగవద్గీత మహాభారతంలోది. వేదసారాన్ని పిండి 'పంచమవేద'మైన మహాభారతాన్ని అందించిన మహర్షి- వేదవ్యాసుడు. కొత్త పురాణం రచించినవారిని 'వ్యాసుడు' అనడం రివాజు. వేదబోధను సామాన్యుల వద్దకు చేర్చడానికి భారతాన్ని రచించి, మళ్ళీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా ఆయన సరళ సుందరంగా సంక్షిప్తీకరించాడు. శంకరాచార్యుల భాష్యంతో భగవద్గీతా జ్ఞానం అందరికీ మరింత చేరువ అయింది.
సత్యవతీ పరాశరుల పుత్రుడైన వ్యాసుడు భారతాన్ని రచించడమే కాదు, ఆ మహేతిహాసంలో తానూ ఒక పాత్రగా పలు పర్యాయాలు దర్శనమిస్తాడు. భారత రచనతో సంతృప్తి చెందని వ్యాసుడు, భాగవతాన్నీ రచించి ధన్యుడయ్యాడు.
వేదం ప్రభువులా శాసించి చెబుతుంది. పురాణం మిత్రుడిలా కథారూపంలో ప్రబోధిస్తుంది. ఇటువంటి భారతీయ సాంస్కృతిక మూలస్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ వందనీయుడయ్యాడు. ఆయన జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండుగను గురుపూజోత్సవంగా, కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమా వ్రతంగా ఆచరిస్తారు. శివభక్తులు శివ శయన వ్రతాన్ని పాటిస్తారు. ఆధ్యాత్మికవేత్తలకే పరిమితమైన 'వ్యాసపూర్ణిమ' నేడు సర్వజన హృదయాహ్లాదకరమైన 'గురుపౌర్ణమి'గా వ్యాప్తి చెందడం శుభ పరిణామం!

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులులతో వారిని పూజిస్తారు.అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామమూ, 'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1 మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.

"శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా
పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం"
అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.

అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి"నాడు వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!'-మరి. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."
ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్నమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః!!

Thursday, July 14, 2016

తొలి ఏకాదశి విశిష్టత.

తొలి ఏకాదశి విశిష్టత..!!

శ్రీ మహా విష్ణువు నిద్రావస్తలోకి వెళ్లే తొలి ఏకాదశి విశిష్టత..!! ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి. దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్య మాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే 'విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక' మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.

గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు అందుకనే ఆయనకు మనం తొలిపూజ చేసిన అనంతరమే శుభకార్యాలను ప్రారంభిస్తాం. గణనాధుడికి ఏకదంతమే వుండటం విశేషం. అందుకే స్వామిని ఏకదంతాయ నమః అని పూజిస్తాం. ఆ జగన్మాత పార్వతీదేవి తనయుడైన వినాయకునికి ఏకదంతుడు అని పేరు రావడం వెనుక ఒక కథ వుంది. బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలో స్వామికి ఏకదంతం ఎలా ఏర్పడింది అన్న అంశంపై వివరాలున్నాయి. ఒకసారి పరశురాముడు ఆదిదంపతుల దర్శనార్థం కైలాసానికి వస్తాడు. అయితే వారు ఏకాంతంలో వున్నారని భంగం కలిగించకూడదని వినాయకుడు అతనిని వారిస్తాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగుతుంది. గణేశుడు ఎంత సౌమ్యంగా చెప్పినప్పటికీ పరశురాముడు గండ్రగొడ్డలిని విసరబోయే యత్నం చేస్తాడు.

ఇంతలో కార్తికేయుడు ప్రవేశించి గురుపుత్రుడిపై ఆగ్రహం వ్యక్తంచేయడం సబబుకాదని హితవు పలికాడు. అయినా పరశురాముడు గొడ్డలి విసిరేందుకు సిద్ధమవుతాడు. దీంతో వినాయకుడు తన తొండాన్ని కొన్ని వందల యోజనాలు పెంచి పరశురాముడిని పట్టుకొని గిరగిరా తిప్పాడు. ఒకసారి ఎత్తుకొని పద్నాలుగు లోకాలను చూపిస్తూ తొండంతో తిప్పాడు.

దీంతో భార్గవరాముడు భీతిచెందాడు. అనంతరం సముద్రాల నీటిని తొండంతో పీల్చివేసిన గణపతి ఒక్కసారిగా అన్నింటిని వెదజల్లి పరశురాముడిని అందులోకి విసిరివేశాడు. సాగరంలో పడ్డ జమదగ్ని పుత్రుడు వెంటనే ఈదుకుంటూ బయటకు వచ్చి పట్టరాని ఆగ్రహంతో గొడ్డలిని విసిరాడు. ఆ పరశువు వేగంగా వెళ్లి వినాయకుడి ఒక దంతాన్ని నరికి తిరిగి అతన్ని చేరుకుంది.

ఈ గొడవకు పరమేశ్వరుడు, పార్వతీలు బయటకు వచ్చారు. తన ముద్దుల తనయుడికి ఒక దంతం లేకపోవడం గమనించిన జగన్మాత ఏం జరిగిందని మురుగన్‌ను అడుగుతుంది. అతను మొత్తం సంఘటనా వివరాలను తెలపడంతో అమ్మ ఉగ్రరూపం దాల్చి పరశురాముడిని శపించేందుకు సిద్ధమవుతుంది. పరశురాముడు తనను క్షమించమని అమ్మను వేడుకోవడంతో ఆమె శాంతిస్తుంది.

అతను కూడా తన తనయుడి లాంటి వాడే కాబట్టి జగన్మాత అతన్ని క్షమించింది. ఒక దంతం అలా పోవడంతో స్వామి ఏకదంతుడిగా పేరుపొందారు. నిత్యం పూజలందుకుంటూ యావత్‌ విశ్వాన్ని పరిరక్షిస్తున్నారు.

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్‌ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి.

అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.

ఆంజనేయ స్వామి అవతారాలెన్నో తెలుసా..?
ఆంజనేయ స్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయ స్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు. అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయ స్వామి
2. వీరాంజనేయ స్వామి
3. వింశతి భుజ ఆంజనేయ స్వామి
4. పంచముఖ ఆంజనేయ స్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయ స్వామి
6. సువర్చలాంజనేయ స్వామి
7. చతుర్బుజ ఆంజనేయ స్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు.

పంచముఖ ఆంజనేయ స్వామి
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి:

1. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

Monday, July 11, 2016

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). 
http://tvramudu.blogspot.in

ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మేరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిల్ఫ్ ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేశి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ధానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి స్మార్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహoకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహoకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా..

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును.

ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.

కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం.

గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.

శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు.

ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి.

పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమంవలన గోవు జన్మించుటచేత గోవునకు అగ్ని హోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో ‘గో’ మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదంగవా తుల్యం నోపశ్యామినృణే త్వామ్’ అని పలుకగా, నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని, అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్నచోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన, గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండప్రదానం చేయలేని వారికి పిండప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి.

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘‘నాథా! జనులు పాపము నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును తెలుపమ’’ని అడగగా - శివుడు పార్వతీదేవితో ‘‘గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదములందు పితృ దేవతలు, కాళ్ళయందు సమస్త పర్వతాలు, దంతములందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జేష్ఠాదేవి, కళ్ళయందు - సూర్యచంద్రాదులు, చెవులయందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణ దేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యములను పొందవచ్చునని, గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని, గోమాతను నమస్కరించి ప్రదిక్షణం చేస్తే భూమండలమంతా ప్రదిక్షణం చేసినంత ఫలము కలుగుతుందని’ చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవులకన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పుమీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞయాగాదులవల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు తెలిసికొన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్నివిధాలా ఆవు మనకు మేలే చేస్తోంది. బ్రతికీ, మరణించీ కూడా ఉపకారమే చేస్తోంది. కనుక గోవులను సంరక్షించుకుందాం!

Thursday, July 7, 2016

పరమేశ్వరుని సృష్టి



యావత్‌ విశ్వంలో సాక్షాత్తూ పరమేశ్వరుని సృష్టిగా వారణాసిని పేర్కొంటారు. ఆ లయకారకుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశీ క్షేత్రంలో జనజీవితం విరాజిల్లుతోంది. పగలు, రాత్రి అని తేడా లేదు నిత్యం వేలాదిమంది యాత్రికులతో సందడిగా వుంటుందీ ఈ దివ్యక్షేత్రం. ద్వాదాశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథక్షేత్రంగా, విశాలాక్షి వెలసిన పవిత్రభూమిగా, అన్నపూర్ణ నేలగా ఈ క్షేత్రం పేరుపొందింది. కాశీ అంటే పవిత్రక్షేత్రం. ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. వేల ఆలయాలు, గంగా హారతి కార్యక్రమం, నిత్య పూజలు, భజనలు, అర్చనలు, భక్తుల రాకపోకలతో ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గుబాళిస్తువుంటుంది.
అందుకనే కాశీయాత్ర గురించి మన పూర్వీకులు కథలు కథలుగా చెబుతుంటారు. కాశీమజిలీ కథలు కూడా ఈ యాత్రావిశేషాలను వెల్లడిస్తూ రాసినవే. 'కాశ్యాన్తు మరణాన్‌ ముక్తి' కాశీలో కన్నుమూస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కాశీ విశ్వనాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశిష్టమైనదిగా కాశీ విశ్వనాథుడిని పేర్కొంటారు. పవిత్ర గంగానదీ తీరాన వున్న ఈ మందిరంలో స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆలయం పలు దండయాత్రల్లో శిథిలమయింది. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాభాయి హోల్కార్‌ ఆలయాన్ని పునరుద్ధరించారు. రుగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కందపురాణంలోని కాశీఖండంలో ఈ ఆలయం గురించిన వివరాలున్నాయి. గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచిది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథుని మందిర నమూనాలో దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా వీక్షించాలి.

కాశీ విశాలాక్షి
ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసారు. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికి ఈ క్షేత్రం ఆరాధ్యనిలయం. ఆ ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి.
అన్నపూర్ణ ఆలయం
సకల ప్రాణకోటికి చోదకశక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాతేఅందిస్తుంది కనుకే అన్నపూర్ణ మాతగా పిలుస్తారు. ఆమె కరుణా, కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తే అన్నపూర్ణ మాతగా కాశీక్షేత్రంలో వెలిశారు. రామ భక్త హనుమాన్‌ ఆలయం సంకట్‌మోచన్‌ మందిరాన్ని కూడా వీక్షించాలి.
ఆదిశంకరుని రచనలు...
ఆద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరులకు ఈ నగరంతో మంచి అనుబంధముంది. ఆయన ఇక్కడే బ్రహ్మసూత్రాలు, భజగోవిందం ... తదితర గ్రంథాలు రచించారు. రామకృష్ణపరమహంస, కబీర్‌, తులసీదాస్‌, రవిదాస్‌...ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తమ ప్రసంగాల్లో, రచనల్లో విశేషంగా ప్రస్తావించారు.
అంతిమ సంస్కారాలకు నిలయం..
కాశీలో కన్నుమూస్తే శివసాయుజ్యం పొందుతారని ఆర్యోక్తి. దీంతో వయోధికులు అనేకమంది కాశీలోనే తమ అంత్యజీవితాన్ని గడపాలని వస్తుంటారు. గంగాతీరంలో 80కు పైగా ఘాట్లు వున్నాయి. వీటిలో దశాశ్వమేధ్‌ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌... ముఖ్యమైనవి. దశాశ్వమేథ్‌ఘాట్‌లో బ్రహ్మదేవుడు పది అశ్వమేధయాగాలను నిర్వహించినట్టు పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘాట్‌లోనే గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. మణికర్ణికఘాట్‌ను మహావిష్ణువే నిర్మించినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఘాట్‌ను నిర్మిస్తుండగా విష్ణువు కుండలం ఇందులో పడిపోయింది. అందుకు అంత పవిత్రమైన ప్రదేశంగా భాసిల్లుతోంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో మహేశ్వరుడు తారక మంత్రాన్ని చెబుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిశ్చంద్రఘాట్‌లో హరిశ్చంద్రుడే కాటికాపరిగా బాధ్యతలు నిర్వహించడంతో ఆయన పేరు మీద ఘాట్‌కు పేరు వచ్చింది.
అన్ని మతాలకు పవిత్రభూమి..
కాశీ కేవలం హిందువులకే కాదు బౌద్ధం, జైన మతాలకు పవిత్రభూమి. బౌద్దులకు పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జైన మత 23 తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించడంతో జైనులకు పవిత్రక్షేత్రమైంది. కాశీ సమీపంలోని సారనాథ్‌లో బుద్ధుడు తొలి ప్రసంగం చేశారు. మన జాతీయ చిహ్నమైన మూడు సింహాల స్థూపం ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది.
ఎలా చేరుకోవచ్చు
* దేశంలోని అన్ని నగరాలతో ఈ నగరానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* వారణాసి సమీపంలోని మొగల్‌సరాయ్‌ పెద్ద జంక్షన్‌. నిత్యం అనేక రైళ్లు ఈ రైల్వేస్టేషన్‌ ద్వారా వెళుతుంటాయి.
* వారణాసి విమానాశ్రయాన్ని అన్ని నగరాలతో విమాన సర్వీసులతో అనుసంధానించారు

సర్వం జగన్నాథం

సర్వం జగన్నాథం
ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.
వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ
జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి
భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత
అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఆషాఢ శుద్ధవిదియ... పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది.
జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ
నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం
కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం
అపురూపం. స్వరం జగన్నాథం.
రెండు నెలల ముందే...
జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ
బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072
ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి
అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు.
వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ
వినియోగిస్తారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల
ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో 'నందిఘోష'ను
అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న
నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న
నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు.
ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.
విదియనాడు...
మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే
'మనిమా(జగన్నాథా)' అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు,
అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే
బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో
బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి
అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో
సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం
ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ
ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు
విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని
తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ
జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... వూరేగింపు
నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
రాజే బంటు...
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా... పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి
నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం
స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ
అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర
మొదలవడమే తరువాయి.
జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి... జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ
తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ(ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది.
లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర
అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు.
అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి
కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా
ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి
తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని
బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు
ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు
భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా
స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.
స్థలపురాణం
ఇంద్రద్యుమ్నుడనే మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా
మలచమనీ ఆజ్ఞాపించాడట. కానీ అలా నదీతీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు
దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి... ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. కానీ తాను తలుపులు
మూసుకుని ఈ పని చేస్తానని తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. కానీ 15 రోజుల తర్వాత... ఉత్సుకతను
ఆపుకోలేని రాజు తలుపులు తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ
జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం.
ఎందుకంటే..?
రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు
బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ
రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన
ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక
మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని
రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం
అన్నమాట!
ఎలా చేరుకోవాలి
ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.